Begin typing your search above and press return to search.

ఒక్క నేత ఎఫెక్ట్.. యూపీ బీజేపీలో కులాల క‌ల‌క‌లం!

By:  Tupaki Desk   |   18 Jan 2022 12:30 AM GMT
ఒక్క నేత ఎఫెక్ట్.. యూపీ బీజేపీలో కులాల క‌ల‌క‌లం!
X
కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క నాయ‌కుడి కార‌ణం.. ఇప్పుడు బీజేపీ ఆప‌శోపాలు ప‌డుతోంది. నాయ‌కులు తీవ్ర స్థాయిలో క‌ల‌క‌లం చెందుతున్నారు. దీనికి కార‌ణం.. కులాల స‌మీక‌ర‌ణ‌లు.. స‌ద‌రు నేత కార‌ణంగా.. ఒక్క‌సారిగా మారిపోయాయి. విష‌యంలోకి వెళ్తే.. యూపీలో కేవలం యాదవులే కాక కుర్మీ, మౌర్య, కుశ్వాహా, సైనీ, రాజ్‌భర్‌ తదితర వెనుకబడిన వర్గాల ఓట్లు కీలకం. గత ఎన్నికల ముందు వరకు యాదవేతర ఓబీసీలు మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ నాయకురాలు మాయావతికి, మరో మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కు మద్దతిచ్చేవారు. అఖిలేశ్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లూ యాదవ్‌-ముస్లిం ఓట్లే తనకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించారు. ఫలితంగా యాదవేతర ఓబీసీలు దూరమయ్యారు.

అటు మాయావతి కూడా బలహీనపడిపోవడంతో నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చక్రం తిప్పి.. యాదవేతర ఓబీసీ నేతలందరినీ బీజేపీలోకి తీసుకొచ్చారు. వీరిలో ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌ నుంచి వైదొలగిన సీనియర్‌ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య ముఖ్యుడు. ఈయనకు మౌర్య వర్గంలో మంచి పలుకుబడి ఉంది. అమిత్‌షా పిలుపు మేరకు బీజేపీలో చేరిన ఈయన యోగి కేబినెట్‌లో కార్మిక మంత్రిగా పనిచేశారు. అయితే.. యోగి కార‌ణంగా ఆయ‌న త‌న‌ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈయన సారథ్యంలోనే మిగతా ఓబీసీ నేతలు కూడబలుక్కుని బీజేపీకి గుడ్‌బై చెప్పి అఖిలేశ్‌తో చేరుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. వీరంతా యోగి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వీరితోపాటు న్యాయ మంత్రి దారాసింగ్‌ చౌహాన్‌, మరో ఓబీసీ కీలక నేత, ఆయుష్‌ శాఖ మంత్రి ధరం సింగ్‌ సైనీ కూడా రాజీనామా చేయడంతో వరుసగా యోగి కేబినెట్ నుంచి మూడో మంత్రి తప్పుకొన్నట్లయింది. ఈ ముగ్గురితో పాటు మొత్తంగా ఇప్పటికి మొత్తం 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సీఎం యోగి ఏకపక్ష వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకే ఇబ్బందిగా మారింది. ఆయనతో విభేదాల కారణంగా మిత్రపక్షం నేత సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీస్‌పీ) నేత ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ కేబినెట్‌ నుంచి.. ఎన్‌డీఏ నుంచి వైదొలిగారు. తాజా ఎన్నికల్లో అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇతర ఓబీసీ మంత్రులు కూడా యోగి నీడ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా చేసిన స్వామి ప్రసాద్‌ మాయావతి ప్రధాన టీమ్‌లో కీలక పాత్ర పోషించి బీఎస్‌పీ ప్రాభవానికి కారకుడయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 2017లో బీజేపీ ఘన విజయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తూర్పు యూపీలోని కుషినగర్‌ జిల్లాకు చెందిన స్వామి ప్రసాద్‌ ప్రభావం రాయ్‌బరేలీ, ఊంచాహార్‌, షాజహాన్‌ పూర్‌, బదయూన్‌ జిల్లాల్లోనూ ఉందని అంచనా. మొత్తం జనాభాలో 8 శాతం ఉన్న మౌర్యులు రాష్ట్రంలోని ఓబీసీల్లో యాదవులు, కుర్మీల తర్వాత అధిక శాతం ఉన్నారు. వీరు ఇప్పుడు బీజేపీకి దూరం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.