Begin typing your search above and press return to search.

గీతం వర్సిటీపై వైసీపీ, ప్రజాసంఘాల ఫిర్యాదు?

By:  Tupaki Desk   |   29 Oct 2020 6:00 AM GMT
గీతం వర్సిటీపై వైసీపీ, ప్రజాసంఘాల ఫిర్యాదు?
X
గీతం యూనివర్సిటీ ఆక్రమణలను ఇటీవల జగన్ సర్కార్ కూల్చివేయడం రాజకీయంగా దుమారం రేపింది. దీన్ని ప్రతిపక్ష టీడీపీ ఖండించింది. జగన్ సర్కార్ కూల్చివేతలపై హైకోర్టుకు ఎక్కింది గీతం వర్సిటీ. మొత్తం 43 ఎకరాల భూమి కోసం న్యాయపోరాటం మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే తాజాగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలపై వైసీపీ ప్రభుత్వం కూడా పోరుబాట పట్టింది. వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ వైద్యమండలికి లేఖ రాశారు. భూముల విషయంలో సరైన డాక్యుమెంట్లు చూపించని గీతంకి ఇచ్చిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

ఇక గీతం యూనివర్సిటీపై ప్రజాసంఘాలు కూడా పోరుబాటు పట్టాయి. గీతం మెడికల్ కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని.. దాని మీద విచారణ జరపాలని ప్రజాసంఘాల జేఏసీ ‘ఈడీ’కి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గీతంకు వచ్చిన విదేశీ విరాళాల మీద విచారణ జరిపించాలని కోరాయి. గీతం తీసుకున్న బ్యాంక్ రుణాల విషయంలోనూ విచారణ జరపాలని డిమాండ్ చేశాయని తెలుస్తోంది

గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడిందని.. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని.. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేశారని ప్రజా సంఘాల జేఏసీ ఆరోపించింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని.. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారని జేఏసీ ఆరోపించింది.

ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ వివాదంగా మారిన ఈ ఇష్యూలోకి తాజాగా ప్రజాసంఘాలు కూడా రావడంతో గీతం వర్సిటీ భూ ఆక్రమాలపై ప్రభుత్వ వాదనకు బలం చేకూరినట్టైంది. ఒకటి తర్వాత ఒకటి గీతం వర్సిటీ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తోంది.