Begin typing your search above and press return to search.

కొత్త వద్దు.. పాడు వద్దు.. పాతదే కంటిన్యూ చేయండి.. పలికించిన జగన్

By:  Tupaki Desk   |   19 Jan 2022 7:29 AM GMT
కొత్త వద్దు.. పాడు వద్దు.. పాతదే కంటిన్యూ చేయండి.. పలికించిన జగన్
X
ఎదుటోడ్ని మాట్లాడేలా చేయటం. ఏమన్నా.. వింటూ ఊరుకోవటం.. చివర్లో పిలిచి మాట్లాడటం.. ఆ పైన చేయాల్సింది చేయటం.. అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో వ్యవహరిస్తూ.. ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునేలా ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు. తాజాగా.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆయన అనుసరించిన తీరుకు ప్రభుత్వఉద్యోగులు ఆగ్రహంతో ఉండి ఉండొచ్చు. కానీ.. కోట్లాది మంది ప్రజలకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల అసలు రూపం అర్థమయ్యేలా చేశారని చెప్పాలి.

ఇప్పుడున్న ఏపీ ఆర్థిక పరిస్థితుల్లో గొంతెమ్మ కోరికలు కోరటంలో అర్థం లేదు. చచ్చి చెడు పొద్దున నుంచి రాత్రివరకు పాఠాలు చెప్పే ప్రైవేటు స్కూళ్లు.. కాలేజీల టీచర్లకు వచ్చే జీతాలు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ.. కాలేజీల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు వచ్చేజీతాలకు ఎక్కడా పోలిక కనిపించదు. ఆ మాటకు వస్తే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి జీతాలు.. వారు చేసే పనికి.. వారికి వచ్చే జీతాలకు పొంతన ఎక్కడా కనిపించదు. అయినప్పటికీ.. తమకు జీతాలు పెంచాలనే వారి డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది.

వీరికొచ్చే జీతాల విషయంలో సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వేలాది రూపాయిలు జీతాలు తీసుకునే ఒక ప్రభుత్వ టీచర్ చేసే పనికి.. వారికి వచ్చే ఆదాయానికి..వచ్చే సెలవులకు సంబంధం ఉండదు. ఒక్క టీచర్లు మాత్రమే కాదు.. వివిధ విభాగాల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల పని తీరును ప్రజలెంతగా చిరాకు పడతారో తెలిసిందే. అయినప్పటికీ ఎప్పటికప్పుడు తమ జీతాల్ని పెంచుకుంటూ పోయే వారికి.. తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

పీఆర్సీ ప్రకటనతో పాటు.. తాజాగా ప్రకటించిన హెచ్ఆర్ఏ గైడ్ లైన్స్ తో ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగిపోయింది. తాము ఒకటి అనుకుంటే.. ప్రభుత్వం మరోలా అనుకోవటం వారికి మింగుడుపడని రీతిగా మారింది.మొన్నటి వరకుకొత్త పీఆర్సీ అంత కావాలి.. ఇంతకావాలి.. అని డిమాండ్ చేసిన వారే.. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు అక్కర్లేదని.. పాత పద్దతిలోనే జీతాలు ఇవ్వాలని కోరటం గమనార్హం.

కొత్త పద్దతిలో జీతాలు వద్దు.. పాత లెక్కల్లోనే ఇవ్వండన్న వరకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు.. ఈ మధ్య వరకు చేసిన డిమాండ్ల మాటేమిటి? అన్నది ప్రధాన ప్రశ్న. ఓవైపు ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న వేళ.. జీతాల పెంపునకు డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది. అందుకు భిన్నంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళలో.. కొత్త జీతాలు కావాలని.. అందుకు వేలాది కోట్లు అవసరమైన వేళ.. తనదైన ప్లాన్ ను అమలు చేసిన సీఎం జగన్ దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారు.

ఇంతకాలం పాతొక రోత.. కొత్తొక వింత అనే నానుడికి భిన్నంగా.. పాతదే ముద్దు.. కొత్తది అస్సలు వద్దు అన్న మాటను ప్రభుత్వ ఉద్యోగుల నోటి నుంచి చెప్పించారు. మరి.. ఇంతకాలం జీతాల్ని పెంచాలన్న డిమాండ్ ఇప్పుడు ఏమైంది? న్యాయబద్ధంగా ఉన్న డిమాండ్ అయితే.. పోరాడాలి కదా? అలా కాకుండా.. మాకెందుకులే అన్నట్లు వ్యవహరించిన తీరు దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూసినోళ్లు మాత్రం సీఎం జగన్ మంచి పనే చేశారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ తరహాలో విషయాల్ని డీల్ చేసే దమ్ము సీఎం జగన్ కు మాత్రమే ఉందని చెప్పాలి.