Begin typing your search above and press return to search.

అన్ని తెలిసీ వెంక‌న్న‌తో మీరెందుకు పెట్టుకున్న‌ట్లు?

By:  Tupaki Desk   |   23 May 2018 4:43 AM GMT
అన్ని తెలిసీ వెంక‌న్న‌తో మీరెందుకు పెట్టుకున్న‌ట్లు?
X
వినేటోడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతార‌ని ఊరికే అన‌రు మ‌రి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల్ని వింటే ఈ విష‌యం ఎంత నిజ‌మో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తాజాగా విశాఖ‌లో మాట్లాడిన ఆయ‌న తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌రస్వామితో పెట్టుకోవ‌ద్ద‌ని.. అప‌రాధం చేసిన వారి నుంచి వడ్డీతో స‌హా అన్ని వ‌సూలు చేస్తాడ‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం తిరుమ‌ల‌లో కుట్ర‌కు తెర తీసింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

కేంద్రం ప‌న్నిన కుట్ర‌లో తిరుమ‌ల‌ను కూడా లాగార‌ని.. ప్ర‌స్తుతం టీటీడీలో ఏం జ‌రుగుతుందో అంద‌రూ చూస్తున్న‌ట్లు చెప్పారు. వేంక‌టేశ్వ‌ర‌స్వామిని తాను న‌మ్ముతాన‌ని.. ఆయ‌న ఆశీస్సులు త‌న‌కున్న‌ట్లు చెప్పారు. త‌న హ‌త్య‌కు 24 క్ల‌మోర్ మైన్స్ తో కుట్ర ప‌న్నార‌ని.. ఆ ఆప‌ద నుంచి వెంక‌న్నే త‌న‌ను కాపాడార‌న్నారు. త‌న‌తో ఏదో ప‌ని చేయించాల‌నే త‌న‌ను కాపాడార‌ని.. అదే న‌శ్యాంధ్ర‌ప్ర‌దేశ్ గా అభివ‌ర్ణించారు.

ఎవ‌రూ వెంక‌న్న‌తో పెట్టుకోవ‌ద్ద‌ని.. వడ్డీతో స‌హా వ‌సూలు చేస్తార‌న్నారు. స్వామికి ఎవ‌రైనా అప‌చారం త‌ల‌పెడితే.. ఈ జీవితంలోనే ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంద‌న్న ఆయ‌న‌.. స్వామి వారి గులాబీ రంగు వ‌జ్రం పోయింద‌ని ప్ర‌చారం చేయ‌టంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న గ‌తంలోనే జ‌రిగింద‌ని.. దీనిపై 2009 నుంచి 2011లో జ‌గ‌న్నాథం.. వాద్వా క‌మిటీల‌తో విచార‌ణ చేయించార‌ని చెప్పారు. అప్ప‌ట్లో పోయింది వ‌జ్రం కాద‌ని కెంపు అని క‌మిటీలే తేల్చాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. అప్ప‌ట్లో అదే విష‌యాన్ని ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్ర‌భుత్వానికి పంపార‌న్నారు.

దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో సంప్ర‌దాయంగా.. ప‌విత్రంగా ఉండే దేవాల‌యం లేద‌ని.. వార‌ణాసితో పాటు అనేక చోట్ల ఏం జ‌రుగుతుందో తెలుస‌న్న చంద్ర‌బాబు.. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడ‌టం.. చ‌క్క‌ని పాల‌న అందించ‌టం రామారావు హ‌యాం నుంచే మొద‌లైంద‌ని.. దాన్ని తాను కాపాడుతూ వ‌స్తున్న‌ట్లు చెప్పారు.

నిజ‌మే.. రామారావు హ‌యాంలో తిరుమ‌ల క్షేత్రం ప‌రిధిని విస్తృతం చేయ‌టంతో పాటు.. దాన్ని కాపాడేందుకు.. మ‌రింత క్ర‌మ‌బ‌ద్ధంగా ఉంచేందుకు ఆయ‌న ఎంతో కృషి చేశారు. కానీ.. దాన్ని తాను కాపాడుతున్న‌ట్లు చెబుతున్న బాబు మాట‌ల్లో నిజం లేద‌ని చెప్పాలి. వెయ్యి కాళ్ల మండ‌పాన్ని కూల్చి వేయ‌టం మొద‌లుకొని.. నిన్న‌టికి నిన్న బాబు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో అన్య‌మ‌తాన్ని ఆచ‌రిస్తున్న‌ట్లు బ‌హిరంగంగా చెప్పుకున్న త‌మ పార్టీ మ‌హిళా నేత‌కు బోర్డు మెంబ‌రుగా ఎంపిక చేయ‌టం చూస్తే.. బాబు మాట‌లు నిజ‌మెంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఓవైపు త‌ప్పులు చేస్తూనే.. మ‌రోవైపు.. వెంక‌న్న‌తో పెట్టుకుంటే పోద‌న్న బాబు మాట‌లు విన్నంత‌నే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల‌కు సంబంధించి ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు చూసిన‌ప్పుడు.. శ్రీ‌వారితో పెట్టుకుంటే అంతేన‌న్న విష‌యం బాబుకు తెలీదా? అని ప‌లువురు ప్ర‌శ్నించుకునేవారు. తాజాగా బాబు మాటలు వింటే.. ఆయ‌న‌కు అన్ని తెలిసే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. మ‌రి..బాబు లాంటోళ్ల‌కు వెంక‌న్న స్వామి త‌న ఎఫెక్ట్ ఎలా చూపిస్తారో కాల‌మే చెప్పాలి.