Begin typing your search above and press return to search.

కుప్పం నుంచి బాబు ఔట్?..లోకేశ్ ఇన్?

By:  Tupaki Desk   |   28 Feb 2020 3:30 AM GMT
కుప్పం నుంచి బాబు ఔట్?..లోకేశ్ ఇన్?
X
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తనదైన వ్యూహాలను మార్చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మొన్నటి కుప్పం పర్యటనలో భాగంగా ఆయన నోట నుంచి వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బాబు తనయుడు నారా లోకేశ్... గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతం అమరావతిలోని మంగళగిరిలో లోకేశ్ ను బరిలోకి దించడం ద్వారా అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని బాబు ఊహించారు. అయితే ఫలితాలు ఎదురు తన్నడంతో బాబు ఇప్పుడు తన కుమారుడిని మంగళగిరి నుంచి కుప్పంకు మార్చుతున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

మంగళగిరిని వదిలేసి లోకేశ్ కుప్పం బరిలో నిలిచే దిశగా చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘త్వరలోనే లోకేశ్ కుప్పం వస్తారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తారు. ఇక్కడి పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తారు. కుప్పంలో టీడీపీకి కొత్తగా యువ శక్తిని తయారు చేస్తారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మాటలు వింటుంటే... వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి తాను కాకుండా లోకేశే బరిలోకి దిగుతారని చంద్రబాబు పరోక్షంగా చెప్పినట్టైందన్న కోణంలో ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. మంగళగిరిలో పార్టీ బలాబలాలను విశ్లేషించుకోకుండానే... కేవలం రాజధానిలో లోకేశ్ గెలిస్తే బాగుంటుందన్న నిర్ణయం మేరకే ఆయనను బరిలోకి దింపారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బలం ముందు లోకేశ్ తేలిపోయారు. అంతేకాకుండా అంతకుముందు కూడా లోకేశ్ కు సేఫ్ జోన్ ఏదైతే బాగుంటుందన్న విషయంపై చంద్రబాబు లెక్కలేనన్ని సర్వేలు చేయించారు. చివరకు ఆ సర్వేలన్నీ పక్కనపెట్టేసి.. మంగళగిరి బరిలోకి దింపి బోల్తా పడ్డారు.

తాజాగా మంగళగిరి టీడీపీకి అంతగా అచ్చి రాలేదన్న వాస్తవం బోధపడిన చంద్రబాబు... తన కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి నిలవాలంటే తనను ఏళ్ల తరబడి ఆదరిస్తున్న కుప్పం అయితేనే బాగుంటుందన్న ఓ నిర్ణయానికి వచ్చారట. తనకు వయసు మీద పడటం - లోకేశ్ ను భవిష్యత్తు నేతగా తీర్చిదిద్దాలన్న నిర్ణయం మేరకు తన నియోజకవర్గాన్ని కుమారుడికి ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే లోకేశ్ కు కుప్పం నియోజకవర్గాన్ని ఇచ్చేసి... తాను ప్రత్యామ్నాయం చూసుకోవాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారట. అంతేకాకుండా తనకు కూడా తన సొంత జిల్లా చిత్తూరులోనే ఏదో ఒక నియోజకవర్గాన్ని చూసుకోవాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. అయితే కుప్పం నుంచి లోకేశ్ బరికి ఇప్పటికే నిర్ణయం తీసుకన్న చంద్రబాబు... తనకు కావాల్సిన నియోజకవర్గంపై సర్వేలు, సమాలోచనలు చేస్తున్నారట.