Begin typing your search above and press return to search.

ఎస్సీ వర్గీకరణ బాధ్యత కేంద్రానిదే... సుప్రీం కీలక తీర్పు

By:  Tupaki Desk   |   10 Aug 2022 3:03 PM GMT
ఎస్సీ వర్గీకరణ బాధ్యత కేంద్రానిదే...   సుప్రీం కీలక తీర్పు
X
ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి ఎస్సీల వర్గీకరణ మీద ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్సీలలో మాల మాదిగలను ఉప కులాలను వేరు చేయాలని వారిని ఏబీసీడీ వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు. దాదాపుగా పద్దెనిందేళ్ళ పోరాటం ఇది. దీని మీద రాజకీయ పార్టీలు ఎటూ మొగ్గకుండా ఎన్నికల వేళ చలి కాచుకుంటూ తమ ప్రయోజనాలను తాము పొందాయి.

ఇక మాదిగ పొరాట సమితి పేరిట మంద క్రిష్ణ మాదిగ రెండు దశాబ్దాలుగా జనాలలో ఉంటూ తమ వారికి రిజర్వేషన్లు కావాలని కోరారు. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం స్పందించాలని నాడు కోరారు. నేడు విభజిత తెలుగు రాష్ట్రాలు కూడా దీని మీద తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని కోరారు.

అయితే ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలది ఒకటే వైఖరి. గోడ మీద పిల్లి మాదిరిగా ఉండడమే వారికి తెలుసు. అదే విధంగా వారు తమ మనసులో మాట బయటపెడితే ఎక్కడ మాల మాదిగ ఓట్లలో ఏవో ఒకటి పోతాయని భయపడ్డారు. ఇపుడు ఈ సమస్య మీద సుప్రీం కోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు వెలువరించింది.

ఎస్సీల వర్గీకరణలో రాష్ట్రాల  పాత్ర ఏదీ లేదని, పార్లమెంట్ లోనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ పరిణామంతో తెలుగు రాష్ట్రాలు ఇపుడు భారీ ఊరటను పొందనున్నాయి. అదే టైమ్ లో కేంద్రం మీద వత్తిడి ఉంటుంది. కేంద్రం అంటే దేశంలోని 28 రాష్ట్రాలు. అలా పార్లమెంట్ ఈ సమస్యను కనుక విశాలంగా ఆలోచించి ముందుకు అడుగువేస్తేనే పరిష్కారం అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతివ్వాలని ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దాని మీదనే సుప్రీం కోర్టు ఇలా తీర్పు వెలువరించింది.

దేశంలో ఎస్సీస్  పెద్ద ఎత్తున ఉన్నారు. ఇది  రాష్ట్రాల సమస్య కానే కాదు. అందువల్ల కేంద్రమే ఒకసారి అమలు  చేస్తే అందరికీ వస్తుంది. అందుకే పార్లమెంట్ లోనే నిర్ణయం జరగాలని సుప్రీం కోర్టు పేర్కొంది. మొత్తానికి చూస్తే మంద క్రిష్ణ పోరాటానికి ఇపుడు తగిన న్యాయం అయితే కేంద్రమే చేయాల్సి ఉంది మరి. ఇక మీదట కేంద్రం మీద వత్తిడి కోసం మంద క్రిష్ణ ఢిల్లీకే రావాల్సి ఉంటుందేమో.

ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పుతో తమకు పూర్తి న్యాయం జరుగుతుందని మంద క్రిష్ణ పేర్కొన్నారు. వ‌ర్గీక‌ర‌ణ‌పై  కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని దాంతో తొందరలోనే తమకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అంటున్నారు.