Begin typing your search above and press return to search.

ఇక చాలు .. టెక్కీలకి వ‌ర్క్ ఫ్రం హోం ఆపేయండి !

By:  Tupaki Desk   |   2 Aug 2021 5:36 AM GMT
ఇక చాలు .. టెక్కీలకి వ‌ర్క్ ఫ్రం హోం ఆపేయండి !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కారణంగా గత ఏడాది లాక్‌ డౌన్‌ ప్రారంభమైంది. దీనితో గడిచిన 15 నెలలుగా ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తున్న ఐటీ ఉద్యోగులను తిరిగి కార్యాలయాల నుంచి పనిచేసేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇక వర్క్‌-ఫ్రం-హోం విధానాన్ని పక్కన పెట్టి , ప్రత్యక్ష విధులను ప్రారంభించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఇటీవల ఆయా కంపెనీల ప్రతినిధులు, ఐటీ ఉద్యోగ సంఘాలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల నుంచి కూడా 100 శాతం మంది ఉద్యోగులు ప‌ని చేసేలా చూస్తున్నామ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలిసింది. ఐటీ కంపెనీల‌న్నీ 100 శాతం మంది ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌నిచేసేలా చూడాల‌ని ఈ సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కారు సూచించింది.

గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌ డౌన్‌ ను ప్రకటించాక, ఐటీ కంపెనీలు వర్క్‌-ఫ్రం-హోం ను తీసుకువచ్చాయి. మొదటగా దీన్ని మూడు నెలలు కొనసాగించగా,ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యం, వర్క్‌-ఫ్రం-హోం వల్ల ఔట్‌ పుట్‌ ఎక్కువగా వస్తుండడంతో,విడతల వారీగా కొనసాగిస్తూ వచ్చాయి. రెండు నెలలుగా రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల్లో తగ్గుముఖం పడుతుండడంతో ఇప్పటికే వేర్వేరు పరిశ్రమలు అన్‌ లాక్‌ ను అమలు చేస్తున్నాయి. ఈ మేర‌కు సెప్టెంబ‌రు 1 నుంచే కార్యాల‌యాల‌ నుంచే ఉద్యోగుల‌తో ప‌నులు చేయించేలా చూడాల‌ని చెప్పింది. ఇందుకు ఐటీ సంస్థ‌లు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరింది. అయితే, ప్ర‌భుత్వ సూచ‌న ప‌ట్ల ప‌లు ఐటీ సంస్థ‌లు విముఖ‌త వ్య‌క్తం చేశాయి. వ‌ర్క్‌-ఫ్రం-హోం వ‌ల్ల త‌మ ఉద్యోగులు మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తున్నార‌ని చెప్పాయి.

క‌రోనా పూర్తిగా త‌గ్గేవ‌ర‌కు వారు ఇంటి నుంచే ప‌ని చేసుకోవచ్చ‌ని ఆయా సంస్థ‌లు ప‌లుసార్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌ట్లో పూర్తి స్థాయిలో కార్యాల‌యాల‌ను తెర‌వ‌డానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల ర‌క్ష‌ణే త‌మకు ముఖ్య‌మని అంటున్నాయి. ప్రత్యక్ష విధులైనా.. వర్క్‌-ఫ్రం-హోం అయి నా.. ఉద్యోగుల ఔట్‌పుట్‌లో పెద్దగా తేడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న వారి పనితీరు చాలా బాగుంది. ఇంకొంతకాలం దీన్ని కొనసాగిస్తాం. గూగుల్‌ కూడా అక్టోబరు 18 వరకు వర్క్‌-ఫ్రం-హోంను పొడిగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఫేస్‌ బుక్‌, విప్రో, కాగ్నిజెంట్‌, డెలాయిట్‌ వంటి బహుళ జాతి కంపెనీలు కూడా అక్టోబరు వరకు వ‌ర్క్ ఫ్రం హోం కి అవకాశం కల్పించాయి.

దేశంలో మూడో ద‌శ క‌రోనా విజృంభ‌ణ త‌ప్ప‌ద‌ని ప‌లువురు నిపుణులు హెచ్చ‌రించిన అంశాన్ని కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు జ‌యేశ్ రంజ‌న్‌కు గుర్తు చేశారు. దీనితో ఉద్యోగుల‌కు వైర‌స్ సోకకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఐటీ ఉద్యోగులంద‌రి కోసం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి వ్యాక్సిన్లు వేస్తామ‌ని జ‌యేశ్ రంజ‌న్ చెప్పారు. అంతేగాక‌, ఆయా కంపెనీల వెలుప‌ల క‌రోనా ప‌రీక్ష‌ల కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయా ఐటీ కంపెలు త‌మ ఉద్యోగులను రిస్క్‌లో పెట్టలేమ‌ని తేల్చి చెప్పాయి. దీంతో ఈ అంశంపై ఐటీ శాఖ ఉన్న‌తాధికారులు, ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది.

కార్యాల‌యాల్లో ఉద్యోగుల‌తో విధులు నిర్వ‌హించేలా చేయ‌డం, అందుకు త‌గ్గ విధివిధానాల‌ను ఖ‌రారు చేయ‌డం వంటి అంశాల‌పై ఈ క‌మిటీ నివేదిక అందించ‌నుంది. కొన్ని రోజుల్లో ఈ క‌మిటీ స‌మావేశం కానుంది. ఐటీ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వ‌డం వ‌ల్ల ఐటీ కంపెనీలు, ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ వారి మీద ప‌రోక్షంగా ఆధార‌ప‌డి వ్యాపారాలు చేసుకుంటోన్న వారికి మాత్రం న‌ష్టాలు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అంటే రియ‌ల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్ట్, ఆతిథ్య రంగాల వంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీపై ఇత‌ర రంగాలు ఆధార‌ప‌డ‌డంతో ప్ర‌భుత్వం ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌నిచేసుకోనివ్వాల‌ని భావిస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన క‌మిటీ ఆగ‌స్టు మొద‌టి వారంలో తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.