Begin typing your search above and press return to search.

ఇదేం పోయేకాలం.. ఇంట్లో ఉన్న ఆడోళ్లను కెలుకుతున్నారే?

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:42 AM GMT
ఇదేం పోయేకాలం.. ఇంట్లో ఉన్న ఆడోళ్లను కెలుకుతున్నారే?
X
ఎంత ఆవేశం వ‌చ్చినా.. ఎంత ఉద్రేకంతో ఊగిపోయినా.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ముఖ్యంగా ప్ర‌జల్లో గుర్తింపు ఉన్న‌వారు.. ఆచి తూచి మాట్లాడాల్సిందే. ఎక్క‌డ ఎలాంటి చిన్న కామెంట్ చేసినా.. క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోవ‌డం.. ట్రోలింగ్ రావ‌డం.. జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు రాజ‌కీయాలు అంటే.. కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌లు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు.. పాల‌న‌కు సంబంధించిన విష‌యాలు.. దూకుడు.. లోపాలు.. అప్పులు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌రిగా అమ‌లు కాక‌పోవ‌డం.. అవినీతి, అక్ర‌మాలు.. వంటి ముఖ్య‌మైన ఇలాంటి వాటికే రాజ‌కీయాలు ప‌రిమిత‌మ‌య్యేవి.

ఎవ‌రూ ఎక్క‌డా `ఇంత‌కుమించి` అనే రేంజ్‌లో ముందుకు సాగేవారుకారు. కానీ, రాను రాను.. రాజ‌కీయాలు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దారితీయ‌డం.. ప్రారంభ‌మైంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాయ‌కుల‌ను వ్య‌క్తిగ‌తంగా కామెంట్లు చేయ‌డం.. స‌న్నాసి, ద‌గుల్బాజీ.. ఎద‌వ‌లు.. అనే మాట‌లు నాయ‌కుల నోటి వెంట అల‌వోక‌గా వ‌స్తున్నాయి. స‌రే.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు కూడా.. వీటిని ఎంజాయ్ చేస్తున్నార‌న్న కోణంలో .. అటు నాయ‌కులు ఈ కామెంట్ల‌ను కొన‌సాగిస్తుండ‌డంతో .. ఇటు మీడియా కూడా య‌థాత‌థంగా వాటిని ప్ర‌సారం చేసిన ప‌రిస్థితి ఉంది.

ఇక‌, ఇప్పుడు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు కూడా దారి త‌ప్పి.. కుటుంబ నేప‌థ్యాన్ని.. కుటుంబంలోని మ‌హిళ‌ల‌ను కూడా రోడ్డుకు లాగుతున్న ప‌రిస్థితి ఏపీలో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2017లో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు దారుగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ అధినేత‌, అప్ప‌టి విప‌క్ష నేత జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేసి.. దూకుడుగా విమ‌ర్శ‌లు చేశారు. జైల్లో ఉండి వ‌చ్చిన వారికి సీఎం ప‌ద‌వి ఇవ్వాలా? అని.. వ్యాఖ్యానించారు. అయితే.. ఏ నాయకుడైనా.. అదికార పార్టీ త‌ప్పుల‌ను ఎత్తి చూపుతార‌ని.. ప‌వ‌న్ మాత్రం ప్ర‌తిప‌క్షాన్ని కామెంట్లు చేయ‌డం ఏంట‌నే ఆందోళ‌న ఆవేద‌న వైసీపీ నేత‌ల్లో క‌నిపించింది.

ఈ క్ర‌మంలోనే ఓ రోజు.. మీడియా స‌మావేశం నిర్వ‌హించిన‌ జ‌గ‌న్... ప‌వ‌న్ గురించి ప్ర‌స్తావిస్తూ.. ``మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌కుకూడా స్పందించాలా!`` అంటూ.. వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక‌, ఈ కామెంట్ల‌ను ఓ వ‌ర్గం మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డంతో.. అప్ప‌టి నుంచి రాజ‌కీయ నేత‌ల వ్య‌క్తిగ‌త విష‌యాలు.. వీధికెక్కాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. జాతీయ స్థాయిలో చూసుకుంటే.. 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై కూడా రాజ‌కీయ విమ‌ర్శ‌లు, క‌థ‌నాలు వ‌చ్చాయి.

మోడీని టార్గెట్ చేయాలని డిసైడ్ అయిన వారు ఏదో రకంగా మోడీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ నోటికి పని చెప్పేవారు. దీనిపై బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన రావటం.. అనంతరం మోడీ కాస్తా ప్రధాని పీఠం మీద కూర్చున్న తర్వాత నుంచి.. ఆ తరహా వ్యాఖ్యలకు చెక్ పడిందని చెప్పాలి. పవన్ కల్యాణ్ కు సంబంధించి చూస్తే.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవటాన్ని ఘోరంగా చిత్రీకరిస్తూ విమర్శలు చేయటం కనిపిస్తుంటుంది. మూడు పెళ్లిళ్లు చేసుకుంటారా? ముప్ఫై పెళ్లిళ్లు చేసుకుంటారా? అన్నది ముఖ్యం కాదు. చట్టబద్దంగా చేసుకున్నారా? లేదా? అన్నదే. మరి.. నైతికత మాటేమిటి? అంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారందరికి నైతికత లేదంటే.. చాలా మంది ఈ జాబితాలోకి రావాల్సి ఉంటుంద‌ని అంటారు ప‌రిశీల‌కులు.

చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.... ఎంపీల విషయంలో గుట్టుగా రెండో భార్య.. మూడో భార్యలు ఎంతమందికి లేరు? అనే మాట త‌ర‌చుగా వినిపిస్తుంది.విజ‌య‌వాడ‌కు చెందిన ఓ కీల‌క నాయ‌కుడు.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న మాజీ ప్ర‌జాప్ర‌తినిధి విష‌యంలో రెండో భార్య‌కు సంబంధించి పెద్ద వివాదమే కొన్నాళ్లు న‌డిచింది.

ఈ మధ్యన పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరిగిన మాటల యుద్ధంలో.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన పోసాని క్రిష్ణమురళి కూడా వివాదాస్పద‌ కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. పవన్ తల్లిని.. భార్యను.. కుమార్తెను సైతం వదలకుండా ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌డం.. దీనిని కాపు నాడు.. సంఘంతోపాటు.. ఒక‌రిద్ద‌రు సినీ న‌టులు కూడా ఖండించారు.

ఇక‌, ఇప్పుడు సీపీఐ నారాయణ వంతు వచ్చింది. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని.. ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెడుతుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జ‌గ‌న్‌.. ధ‌ర్మ‌రాజును త‌ల‌పిస్తున్నార‌న్న ఆయ‌న‌.. తాక‌ట్టు పెట్టేందుకు కూడా కొన్ని హ‌ద్దులు ఉన్నాయ‌ని తెలిపారు. ధ‌ర్మ‌రాజు తాక‌ట్టు పెట్టి.. తాక‌ట్టు పెట్టి.. చివ‌రకు త‌న భార్య‌నే తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితి తెచ్చుకున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. వాస్త‌వానికి విమ‌ర్శ‌లు చేయాలంటే.. రాజ‌కీయ నాయ‌కుల‌కు చాలానే స‌బ్జెక్టులు ఉన్నాయి. కానీ, ఇలా.. వ్య‌క్తిగ‌తంగా.. ఇబ్బందులు క‌ల్పించేలా కామెంట్లు చేయ‌డం ఎందుకు? అనేది విశ్లేష‌కుల మాట‌. ఇక‌, నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఓ వ‌ర్గం మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో నారాయ‌ణ ఏమ‌న్నార‌నే విష‌యం క‌న్నా.. మ‌రో కోణంలో ఈ వ్యాఖ్య‌లు ప్ర‌చారమై.. తీవ్ర వివాదానికి దారి తీశాయి.