Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం: ఇక ఉద్యోగుల బాధ్యత ఆ కమిటీదే..

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:36 AM GMT
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం: ఇక ఉద్యోగుల బాధ్యత ఆ కమిటీదే..
X
తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా అన్నిరకాల కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ‘పరిపాలన సంస్కరణ’ కమిటీని నియమించారు. ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీని కేసీఆర్ నియమించారు. ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన నలుగురు ఐఏఎస్ అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైన నివేదికకు ఎప్పటికప్పుడు రెడీ చేస్తారు.

సీఎం నియమించిన ఈ కమిటీలో శేషాద్రి తో పాటు సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఉంటారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా 101 మంది మినహా మిగతా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరియారని సమీక్ష సమావేశంలో సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో ఉద్యోగుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఇక జిల్లాల్లోని వివిధ శాఖల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల నిర్మాణలు పూర్తవుతున్న నేపథ్యంలో ఉద్యోగలు పనితీరు, ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో సంస్కరణల్లో భాగంగా వీఆర్వోలు, ఆర్డీవోలు వీఆర్ఏలను ఇతర శాఖల్లో భర్తీ చేయాలన్నారు. వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏయే శాఖల్లో ఎంతమేరకు పని ఒత్తిడి ఉందో గ్రహించి ఉద్యోగులపై ప్రెషర్ లేకుండా చూడాలన్నారు.

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగిందని, ఇంకా మెరుగైన సేవలను ఉపయోగించుకునేందకు పరిపాలన కమిటి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసే విధంగా నడుచుకోవాలన్నారు. విద్య, వైద్య, మున్సిపల్, ఇతర శాఖల్లోని ఉద్యోగులు సమర్థవంతంగా పని చేసే విధంగా పరిపాలన కమిటీ తగు సూచనలు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికను అందించాలని, మెరుగైన సేవల కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.