Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల ఏర్పాటు మొదలైతే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయా?

By:  Tupaki Desk   |   14 July 2020 11:45 AM GMT
కొత్త జిల్లాల ఏర్పాటు మొదలైతే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయా?
X
తెలంగాణలో అడిగిన వారికి అడగని వారికి జిల్లాలిచ్చేశారు కేసీఆర్. ఆందోళన చేసిన వారికి.. ఉద్యమించిన వారికి జిల్లాలిచ్చారు. ఎలాగోలా గొడవల్లేకుండానే జిల్లాల విభజనను పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ జిల్లాల విభజన తేనెతెట్టను కదిపేసరికి రోజుకో డిమాండ్ వస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం జిల్లాలు చేయవద్దనే డిమాండ్ ఊపందుకుంటోంది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం జగన్ అప్పుడు ప్రతీ పార్లమెంట్ ను ఒక జిల్లాగా చేసి పరిపాలన వికేంద్రీకరణ చేస్తాను అని హామీ ఇచ్చాడు. అయితే అప్పుడు జగన్-వైసీపీ గాలిలో ప్రజలు అది ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు చేద్దాం అనేటప్పటికీ ప్రజలకే కాక.. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా పార్లమెంట్ ను జిల్లాగా చేయడం నచ్చడం లేదు.

ఎందుకంటే జియోగ్రాఫికల్ గా పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలు చేస్తే ప్రతీ నియోజకవర్గం వాళ్లు ఇబ్బంది పడుతారని తేలింది. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఆధోని, మంత్రాలయం వాళ్లు మాకు అధోని జిల్లా చేయాలి అని కోరుతున్నారు. పీలేరు, మదనపల్లి వాళ్లు మాకు రాజంపేట జిల్లా వద్దు అని.. మాకు మదనపల్లి జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో కందుకూరు వాళ్లు మాకు నెల్లూరు వద్దు అని.. గిద్దలూరు వాళ్లు మార్కపురం చేయమని.. లేకపోతే ఇంతకుముందు ఉన్న నంద్యాల జిల్లాలో మమ్మలను కలుపమని కోరుతున్నారు.

ఇక ఉత్తరాంధ్ర చివరన ఉన్న శ్రీకాకుళం వాసులదీ మరో కథ.. జిల్లాలో ఇలాంటి సమస్యలు ఇటీవల సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే ధర్మానా ప్రసాద్ రావు లేవనెత్తారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం జిల్లాలు చేస్తే స్థానికంగా ఇబ్బందులు.. ఒకవేళ ఇలానే చేస్తే ఖచ్చితంగా ఉద్యమాలు వస్తాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధిష్టానాన్ని ప్రజలు, నేతల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని.. అందరితో మాట్లాడి డిసైడ్ చేయండి అని ఏపీ సీఎం జగన్ ను కోరారు.

ఇలా జిల్లాల విభజన ఏపీలో రాజకీయ అలజడి సృష్టిస్తోంది. మరి వీటిని సీఎం జగన్ ఎలా పరిష్క్రరిస్తారు.. ఎలా ముందుకెళుతారన్నది వేచిచూడాలి.