Begin typing your search above and press return to search.

సీఐడీ దర్యాప్తు... జగన్ కు బాబు దొరికిపోయారా?

By:  Tupaki Desk   |   23 Jan 2020 8:44 AM GMT
సీఐడీ దర్యాప్తు... జగన్ కు బాబు దొరికిపోయారా?
X
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా జరిగిన భూమి కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రారంభమైన సీఐడీ దర్యాప్తు పెను సంచలనాలు రేపేలానే కనిపిస్తోంది. ఇప్పటిదాకా తనపై అవినీతి మరక అంటలేదని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ నేేతలు, సన్నిహితులు... అమరావతి భూ కొనుగోళ్ల ఉచ్చులో చిక్కుకోనుందన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఈ దర్యాప్తు పూర్తి అయితే... చంద్రబాబును రాజకీయంగా తెరమరుగు కావడంతో పాటుగా టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతోందన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు తాను దర్యాప్తు చేస్తూనే... ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేయాలని ఆదాయపన్ను శాఖకు, ఈ కేసులో మీరూ ఇన్వాల్స్ కావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు సీఐడీ అధికారులు లేఖ రాసిన వైనం కూడా కలకలం రేపుతోంది.

సరే.. ఈ కేసు వివరాల్లోకి వెళితే... 2014 ఎన్నికల్లో విభజిత ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు... రాజధాని లేని ఏపీకి విజయవాడకు సమీపంలోని గుంటూరు జిల్లా పరిధిలోని తుళ్లూరుకు అమరావతి అని పేరు పెట్టేసి రాజధానిగా ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందే... రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నూజివీడులొో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లుగా తన పార్టీ నేతలతో ప్రచారం చేయించిన చంద్రబాబు... అమరావతిలో తనకు, తన అనుయాయులకు పెద్ద ఎత్తున భూములు సేకరించుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే ఎటూ అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఆరోపణలను ఖండించి ముందుకు సాగింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం దక్కగా... వైసీపీ బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అమరావతిలో చంద్రబాబు అండ్ కో... ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఆరోపించిన వైసీపీ సర్కారు... దానిపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనకు అనుగుణంగా వైసీపీ సర్కారు... సీఐడీని రంగంలోకి దించేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన సీఐడీ... ప్రాథమికంగానే సంచలన విషయాలను వెలికితీసిందట. రాజధాని గ్రామాలకు చెందిన తెల్ల రేషన్ కార్డుదారులు ఎకరా రూ.3 కోట్లు విలువ చేసే భూములను భారీగా కొనుగోలు చేసినట్లుగా సీఐడీకి ఆధారాలు లభించాయట. ఇలా నిరుపేదలుగా ఉండి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కొనుగోలు చేసిన వారు ఒక్కరో, ఇద్దరో కాదట... ఏకంగా 796 మంది ఉన్నారట. వీరందరి పేర్లను సేకరించిన సీఐడీ వారిని గుర్తించే పనిని మొదలెట్టిందట. ఇందుకోసం ఏకంగా నాలుగు దర్యాప్తు బృందాలను సీఐడీ ఏర్పాటు చేసిందట. అదే సమయంలో ఈ కొనుగోళ్లకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేయాలని ఆదాయపన్ను శాఖకు, ధర్యాప్తులో ఇన్ వాల్వ్ అయ్యి మనీల్యాండరింగ్ జరిగిందో, లేదో తేల్చాలని ఈడీకి సీఐడీ లేఖలు రాసిందట. మొత్తంగా ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో అమరావతిలో పేదల పేరిట భూములు కొన్నదన్న ఆధారాలను పక్కాగానే పట్టేసిన వైసీపీ సర్కారు... ఏ క్షణంలో అయినా వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకునేలానే ఉందన్న వాదన వినిపిస్తోంది.