Begin typing your search above and press return to search.

హత్రాస్ కేసు : నిందితుల్లో ఒకడు మైనర్ ..వెల్లడించిన సిబిఐ !

By:  Tupaki Desk   |   20 Oct 2020 2:50 PM GMT
హత్రాస్ కేసు : నిందితుల్లో ఒకడు మైనర్ ..వెల్లడించిన సిబిఐ !
X
హత్రాస్ గ్యాంగ్‌ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి నాలుక కోసి, చిత్రహింసలు చేసిన సంఘటన యూపీ లోని హత్రాస్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఆ తర్వాత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత బాధితురాలిని కుటుంబసభ్యులకు చూపించకుండా అనుమతించకుండానే పోలీసులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ, మృతదేహాన్ని అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయింది.

ఇదిలా ఉంటే, ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పలు పార్టీలు సైతం ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సైతం కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ కేసుని ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తుంది. తాజాగా ఈ కేసులో నలుగురు నిందితుల్లో ఒకడు మైనర్ అని సీబీఐ వెల్లడించింది. అతని స్కూలు మార్క్ షీట్ ప్రకారం ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు జరిపిన దర్యాప్తులో చాలా లోపాలు ఉన్నాయని వారు తెలిపారు. అధికారులు తమ ఇంటికి వచ్చి, తన కొడుకు మార్కుల షీట్ తీసుకువెళ్లారని, తన కొడుకు మైనర్ అని నిందిత బాలుడి తల్లి చెప్పింది. మార్కుల షీట్ లో వాడు పుట్టినతేదీ 2002, డిసెంబరు 2 అని ఉంది. అయితే ఈ తేదీ వివరాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారు అధికారులు. కాగా హత్రాస్ కేసు నిందితులు ప్రస్తుతం అలీగఢ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిని సీబీఐ 8 గంటలపాటు విచారించింది.