కంప్రోటలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తాజాగా ఇచ్చిన నివేదిక ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏడేళ్లలో లక్ష కోట్లకు పైగా అప్పులు చెల్లించాల్సి ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు.. అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు.. మళ్లీ అప్పులు చేస్తారా? అంటూ.. నిప్పులు చెరిగింది. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టింది.
ఇక
రుణాలు.. వడ్డీలు వంటివాటిపై శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక
వ్యవహారాలు ఉంటున్నాయని పేర్కొంది. బడ్జెట్లో చూపకుండా...అప్పులు చేసి
ఖర్చుచేస్తున్న వ్యవహారాలను తప్పుబట్టింది.
వచ్చేఏడేళ్లలో లక్షా 10
వేల 10 కోట్ల రూపాయల అప్పు చెల్లించాల్సి ఉందని కాగ్ తన నివేదికలో
పేర్కొంది. అదేసమయంలో వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయడమేంటని
విస్మయం వ్యక్తంచేసింది. రాష్ట్ర బడ్జెట్ నిర్వహణ తీరు బాగోలేదని కాగ్
ఆక్షేపించింది. అయితే.. ఈ నివేదికను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ.. సమావేశాల
తుదిరోజు సభలో ప్రవేశ పెట్టడం గమనార్హం.
వడ్డీలే నడ్డి విరుస్తున్నాయ్!
2020
మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ పూర్తయిన వాటిని
కాగ్ విశ్లేషించింది. ఒకవైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం
పెరిగిపోతోందని.. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి
చెల్లించాల్సిన వాటాయే అధికమని తెలిపింది.
గడిచిన అయిదేళ్లలో
కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65 నుంచి 81% పాత అప్పు
తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోందని స్పష్టం చేసింది. రోజువారీ అవసరాలు
తీర్చుకునేందుకు రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం
ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రణాళిక లేకపోతే.. ప్రమాదమే!
రుణాలు
చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు
ఉండవని కాగ్ తేల్చిచెప్పింది. ఒకవైపు సగటున.. 6.31% వడ్డీతో అప్పులు
తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు కార్పొరేషన్ల ద్వారా కనీసం
0.04% ప్రతిఫలం కూడా పొందడం లేదని ప్రస్తావించింది.
రాబోయే
ఏడేళ్లలోనే లక్షా 10 వేల 10 కోట్ల ర రూపాయల అప్పులను... ప్రభుత్వం
తీర్చాల్సి ఉంటుందని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 32
వేల 373 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి
17.20 శాతం ఎక్కువని... కాగ్ తెలిపింది.
చెప్పింది.. చేసింది.. పొంతన ఏదీ?
బడ్జెట్
పద్దుకు సంబంధం లేకుండా 26 వేల 968 కోట్ల అప్పులున్నాయని వీటిని
బడ్జెట్లో చూపకపోవడం శాసనసభ పర్యవేక్షణను నీరుగార్చడమేని కాగ్
దుయ్యబట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీడీ ఖాతాలకు రూ.93122 కోట్లు
బదిలీ చేసినట్లు ప్రభుత్వ చెప్పిందని అయితే.. వాటిలో ఉన్న నిధులు 38 వేల
599 కోట్లు మాత్రమేనని కాగ్ తెలిపింది.
దీనిని బట్టి చెప్పిన
దానికీ.. చేసిన దానికీ సంబంధం లేదని వెల్లడించింది. ఆర్థిక పద్దులు
చూస్తే ఈ విషయాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని తెలిపింది. పద్దుల
ప్రకారం నిధుల బదిలీలకు సంబంధించి 54 వేల 522 కోట్లు చెల్లింపులకు
సంబంధించి 36 వేల 202 కోట్లు వ్యత్యాసం కనిపిస్తోందని కాగ్ వివరించింది.
కేంద్రం నిధులు 14 వేల కోట్లు సొంతానికి ఖర్చా?!
కేంద్రం
ఇచ్చే గ్రాంట్లను ఏం చేస్తున్నారని.. ఏపీ సర్కారును కాగ్ తన నివేదికలో
ప్రశ్నించింది. ఈ నిధులను వేరే ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని
పేర్కొంది. దీంతో కేంద్ర పథకాల అమలు లక్ష్యాలు నెరవేరట్లేదని కేంద్ర
ప్రభుత్వం ఆ తర్వాత అందించాల్సిన గ్రాంట్లపైనా ఇది ప్రభావం చూపుతోందని
పేర్కొంది. 2018-19లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.16608
కోట్లురాగా..రాష్ట్ర ప్రభుత్వం 4514 కోట్లే ఖర్చు చేసిందని ఇక 2019-20లో
11 వేల 781 కోట్ల నిధులు కేంద్రం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 5 వేల 961
కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు కాగ్ వివరించింది. మిగిలిన నిధులను సొంత
పథకాలకు వాడుకున్నారని స్పష్టం చేసింది.