Begin typing your search above and press return to search.

సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్ సోషల్ మీడియా టేకప్ చేయొచ్చుగా?

By:  Tupaki Desk   |   16 Aug 2022 11:30 AM GMT
సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్ సోషల్ మీడియా టేకప్ చేయొచ్చుగా?
X
సిల్లీ సిల్లీ అంశాలకు సైతం సీరియస్ గా రియాక్టు అయ్యే తీరు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక కీలకమైన అంశం.. దేశ స్వాతంత్య్రపోరాటంలో కోట్లాది మందికి నిలువెత్తు స్ఫూర్తిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన మిస్టరీని వీడే విషయంలో సోషల్ మీడియా ఎందుకు రియాక్టు కాదు? బోస్ అంశాన్ని ఎందుకు టేకప్ చేయదు. దేనికైనా టైమింగ్ చాలా ముఖ్యం అనుకుంటే.. పంద్రాగస్టు వజ్రోత్సవాలకు మించిన సరైన సందర్భం ఇంకేం ఉంటుంది చెప్పండి.

దీనికి తోడు 79 ఏళ్ల సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సైతం గళం విప్పిన సందర్భానికి మించిన మంచి టైం ఇంకేం ఉంటుంది? ఆస్ట్రియాలో పుట్టిన ఆమె తాజాగా జర్మనీలో స్థిరపడ్డారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేతగా మంచి పేరున్న ఆమె ఆర్థిక వేత్తగా కూడా సుపరిచితం. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా యూరప్ కు వెళ్లి ఉద్యమాన్ని సాగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 1930ల ప్రాంతంలో ఎమిలీ షెంకెల్ తో ప్రేమలో పడటం.. ఆమెను పెళ్లాడటం.. వారికి పుట్టిన బిడ్డే అనితా బోస్.

తాజాగా ఆమె సరికొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. బోస్ ఆస్థికలు జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయని.. ఇంతకాలం వాటిని ఇవ్వటానికి ఒప్పుకోని జపాన్.. ఇప్పుడు మాత్రం ఆ ఆస్థికల్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆమె చెబుతున్నారు. ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుంది? అన్నది ప్రశ్న. బోస్ ఆస్థికల్ని భారత్ కు తీసుకురావటం.. వాటిని అత్యున్నత సాంకేతికతతో డీఎన్ఏ పరీక్షలు జరిపితే.. ఆస్థికలు బోస్ వా? కావా? అన్నది తేలిపోతుందన్నది ఆమె వాదన.

విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదన్న వాదన కూడా ప్రచారంలో ఉండటం తెలిసిందే.ఈ అంశంపై ఇప్పటికి పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన మరణం ఇప్పటికి మిస్టరీగానే పలువురు భావిస్తారు. తైవాన్ లో జరిగిన ప్రమాదంలో బోస్ మరణించినట్లుగా చెబుతున్నా.. ఆయన మరణంపై వేసిన కమిషన్లలో జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్ మాత్రం ఆ వాదనను విభేదించింది.

తైవాన్ లోని విమాన ప్రమాదం తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని పేర్కొంది. ఇలాంటి వేళ.. నేతాజీ మరణం.. రెంకోజీ టెంపుల్ లో ఉన్న ఆస్థికలు నేతాజీవా? కావా? అన్నది తేల్చాలంటే.. భారత ప్రభుత్వం ఆయన ఆస్థికల్ని జపాన్ నుంచి ఇండియాకు తెప్పించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న వేళ.. ఆ పోరాటంలో మరణించిన ఉద్యమ నేత ఆస్థికలకు తగిన గౌరవం ఇచ్చేలా దేశంలోనే భారీ స్మారకం నిర్మించాల్సిన అవసరం ఉంది.

అన్నింటికి మించి ముందుగా.. బోస్ కుమార్తె డిమాండ్ చేసినట్లుగా.. ఆస్థికల్ని డీఎన్ఏ పరీక్షలు చేయాలి. మరి.. ఇలాంటి ఇష్యూను సోషల్ మీడియా టేకప్ చేస్తే.. పాలకుల మీద ఒత్తిడి పెరుగుతుంది కదా? దాంతో.. దశాబ్దాల తరబడి సాగుతున్న మిస్టరీని తేల్చేయొచ్చు కదా? అలా ఎందుకు జరగటం లేదు? అన్నది ప్రశ్న.