Begin typing your search above and press return to search.

వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేత‌లు.. బంధం ఎలా క‌లిసిందంటే!

By:  Tupaki Desk   |   26 Jan 2022 1:30 PM GMT
వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేత‌లు.. బంధం ఎలా క‌లిసిందంటే!
X
ఇటీవల వైసీపీలో ఇద్ద‌రు నాయ‌కులు వియ్యం అందుకున్నారు. ఎమ్మెల్యేలు కొలుసు పార్థ‌సార‌థి (పెన‌మ‌లూరు), బొర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌(క‌నిగిరి) కుటుంబాలు రెండూ.. వియ్యం అందుకున్నాయి. ఇప్పుడు టీడీపీలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. కూడా వియ్యం అందుకోబోతున్నారు. వైసీపీలో జ‌రిగిన వివాహం పెద్ద‌లు కుదిర్చింది అయితే.. టీడీపీలో జ‌ర‌గ‌బోయే వివాహం ప్రేమ పెళ్లి కావ‌డం విశేషం. టీడీపీ బెజవాడ ఫైర్ బ్రాండ్.. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుటుంబం, నంద్యాల టీడీపీ నేత,, ఫైర్ బ్రాండ్ ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం వియ్యం అందుకోనున్నాయి.

బోండా ఉమా కుమరుడు సిద్దార్ధ్..ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లి చేసుకోనున్నారు. రెండు కుటుంబాల మధ్య నిర్ణయం జరిగింది. మార్చి 27న వీరి వివాహ నిశ్చితార్ధం కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ చేసేందుకు నిర్ణయించారు. అమెరికాలో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ స‌మ‌యంలోనే ప్రేమ చిగురించింద‌ని తెలుస్తోంది. త‌ర్వాత‌.. ఇరువురు కుటుంబాలు కూడా సూత్ర‌ప్రాయంగా వీరి ప్రేమ‌కు అంగీక‌రించాయి.

వాస్త‌వానికి గత ఏడాదే ఈవిష‌యం వెలుగు చూసినా.. అప్ప‌ట్లో ఏవీ సుబ్బారెడ్డి కొన్ని విష‌యాల్లో ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌తిపాద‌న‌ను వాయిదా వేశారు. ఇక‌, వివాహం చేసుకోనున్న ఈ ఇద్ద‌రు కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రధానంగా ఎన్నారై టీడీపీ విభాగంతో ఈ ఇద్దరిదీ కీ రోల్ గా ఉంది. దీంతో ఈ విష‌యంపై చంద్ర‌బాబు కూడా స్పందించార‌ని.. ఆయ‌న కూడా ఇద్ద‌రిని ఆశీర్వ‌దించార‌ని పార్టీలో గుస‌గుస వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మీడియాకు స‌మాచారం అంద‌డం విశేషం.

టీడీపీలో పెళ్లి బంధాలు.. పాత‌వే!

టీడీపీలో నేత‌ల కుటుంబాల మ‌ధ్య వియ్యం అందుకున్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంల‌నే అప్ప‌టి మంత్రులు గంటా శ్రీనివాస రావు.. పొంగూరు నారాయణ వియ్యంకులు అయ్యారు. అదే విధంగా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం గంటాకు వియ్యంకులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు - కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వియ్యంకులు.

అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన నాయుడు - విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తును చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు సోదరి ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ గారు సైతం టీడీపీ నేతగా ఉన్నారు. ఇలా.. ఇంకా చాలా మంది నేతలు పార్టీలకు అతీతంగా బంధుత్వాలు వివాహాలతో కలుపుకున్న వారి జాబితా చాలానే ఉంది. ఇక, ప్రస్తుతం బోండా ఉమా టీడీపీలో కీలక నేతగా మారారు. అదే విధంగా నంద్యాల టీడీపీలో ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తొలి నుంచి భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారు.