Begin typing your search above and press return to search.

ఇప్పుడే ఇలా ఉంది.. జాబితాలు రిలీజ్ అయ్యే కొద్దీ రచ్చేనా?

By:  Tupaki Desk   |   16 Jan 2022 4:54 AM GMT
ఇప్పుడే ఇలా ఉంది.. జాబితాలు రిలీజ్ అయ్యే కొద్దీ రచ్చేనా?
X
కమలనాథులకు కొత్త టెన్షన్ గా మారింది యూపీ రాజకీయం. తమ అంచనాలకు భిన్నంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓపక్క సర్వే రిపోర్టులు యూపీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేంది బీజేపీనేనని చెబుతుంటే.. అందుకు భిన్నంగా యోగి సర్కారులో మంత్రులుగా వ్యవహరించిన వారు.. ఎమ్మెల్యేలు ఒకరు తర్వాత ఒకరు చొప్పున.. సమాజ్ వాదీ పార్టీలోకి వెళ్లిపోతున్న వైనం షాకుల మీద షాకులు ఇస్తోంది. దీంతో.. ఈ వలసల్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది ఇప్పుడు వారికో సమస్యగా మారిందంటున్నారు.

ముందుగా అనుకున్న దాని ప్రకారం.. ఏదోలా ఎస్పీ - కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని భావించారుకానీ.. అలాంటిదేమీ లేకుండా ఎవరికి వారుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. యూపీ ఎన్నికల్లో పోటీ మొత్తం బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ మధ్యనే సాగనుంది. నిజానికి ఇప్పటివరకు వెలువడిన సర్వే రిపోర్టుల ప్రకారం సమాజ్ వాదీ పార్టీ 150 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలదని చెబుతున్నారు.

అయితే.. గడిచిన మూడు..నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్నరాజకీయ పరిణామాల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ క్రమంగా పుంజుకుంటుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఈసారికి కాస్త సీట్లు తగ్గినా బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు.అయితే.. ఈ వాదనలో నిజం లేదంటున్నారు. ఎందుకంటే.. ఏ రాష్ట్రంలో అయినా అధికారపార్టీ జోరు తగ్గిందంటే.. కాసిన్నిసీట్లు తగ్గి..మళ్లీ అధికారం రావటం అన్నది ఉండదు. అయితే.. స్వీప్ కొట్టటం లేదంటే.. విపక్షం విజయం సాధించటమే ఉంటుందని చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా 2014, 2019లో మోడీ నాయకత్వంలో బీజేపీ గెలుపు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ టికెట్ల పంపిణీ తలనొప్పిగా మారనుందని చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం రెండు జాబితాల్ని విడుదల చేయటం తెలిసిందే. ఇందులో మొదటి విడతలో 58 సీట్లకు 57 మంది.. రెండో విడతలో 55 స్థానాలకు సంబంధించి 48 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం 105 మంది అభ్యర్థుల్లో 63 మంది మాత్రమే సిట్టింగులు ఉన్నారు. దీంతో.. టికెట్లు లభించని వారు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమకు టికెట్లు ఇవ్వకుండా పార్టీ హ్యాండిచ్చిన వేళ.. వారు ఎస్పీ వైపునకు మళ్లితే పార్టీకినష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు (మొత్తం 10 మంది) ఎస్పీకి వెళ్లిన నేపథ్యంలో.. టికెట్లు లభించని సిట్టింగులు అసంతృప్తులుగా పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తారని చెబుతున్నారు. మొత్తం ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో.. జాబితాలు విడుదలయ్యే కొద్దీ.. కొత్త అసంతృప్తులు తెర మీదకు రావటం.. తిరుగుబాటు బావుటా ఎగురవేసే ప్రమాదం ఉందంటున్నారు. టికెట్ల ప్రకటనకు ముందే పది మంది పార్టీని వీడిన వేళ.. అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత రచ్చ తప్పదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.