Begin typing your search above and press return to search.

మునుగోడులో బీజేపీ బౌలింగ్ గేమ్.. క్లీన్ బౌల్డేనా?

By:  Tupaki Desk   |   13 Aug 2022 11:08 AM GMT
మునుగోడులో బీజేపీ బౌలింగ్ గేమ్.. క్లీన్ బౌల్డేనా?
X
మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకు సవాల్ గా మారింది. ఎత్తుకు పైఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలు.. చేరికలు బహిరంగ సభలతో మునుగోడు మరింత రసవత్తరంగా మారింది. కనీసం ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా రాకముందే అగ్ర నేతలు రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఈ నెల 21న మునుగోడు బహిరంగ సభలో పాల్గొననున్నారు.

మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆ సందర్భంగానే బీజేపీలో చేరనున్నారు. దీనిని ముందుగానే ఊహించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. గత వారమే మునుగోడు నియోజకవర్గ కేంద్రం చండూరులో బహిరంగ సభ నిర్వహించారు. నాటి సభలోనే రాజగోపాల్
రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ కంటే ముందే టీఆర్ఎస్ సభ

ఈ నెల 21న బీజేపీ అగ్ర నేత షా సభకు ఒక్క రోజు ముందే తాము సభ నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నిర్ణయించింది. అభ్యర్థిగా ముందంజలో ఉన్న నాయకుడిపై తీవ్ర అసమ్మతి రేగుతుండడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ప్రగతి భవన్ లో గంటల కొద్దీ సమీక్షిస్తున్నారు. అంతేకాదు.. ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు.

టీఆర్ఎస్ సంక్షేమం.. కాంగ్రెస్ సంస్థాగతం.. బీజేపీ బౌలింగ్

ముక్కోణపు మునుగోడులో పార్టీలు తమదైన శైలిలో వెళ్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అలవాటైన సంక్షేమ మంత్రాన్ని మళ్లీ జపిస్తోంది. ఇందులోభాగంగా పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. కాంగ్రెస్ ఎలాగూ సంస్థాగతంగా బలంగా ఉన్నందున రేవంత్ ఆధ్వర్యంలో పాదయాత్రతో ప్రజలకు చేరువ కావాలని చూస్తోంది. ఇక బీజేపీ.. రాజగోపాల్ రెడ్డి బలాన్నినమ్ముకుని ముందుకెళ్తూ పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ‘‘బౌలింగ్’’ అనే వ్యూహాన్ని బీజేపీ తెరపైకి తెస్తోంది.

ఏమిటీ బౌలింగ్?

బౌలింగ్ అనేది ఒక గేమ్. సీసా తరహాలో ఉండే పది పిన్ లను వరుసలో ఉంచి.. బంతితో వాటిని పడగొట్టే ఆట. ఇందులో పదిసార్లు బంతిని త్రో చేయొచ్చు. మధ్యలో ఉన్న పిన్ ను పడగొడితే మిగతావీ పడిపోతాయి. అలాచేయగలిగితే.. విజయం సాధించినట్లు. అయితే, బౌలింగ్ గేమ్ పూర్తిగా నగరాలు, పట్టణాలకు పరిమితమైన ఆట. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. పెద్ద నగరాల్లో తప్ప పట్టణాల్లో లేనే లేదు. కాకపోతే, యువతలో దీనికి కొంత ఆదరణ ఉంది. కానీ, పూర్తిగా ప్రజల్లోకి వెళ్లిందని మాత్రం చెప్పలేం. ఇప్పుడిదే బౌలింగ్ గేమ్ ను తెలంగాణలో అనుసరించాలని బీజేపీ చూస్తోంది. తద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయానికి ఈ బౌలింగ్ గేమ్ కీలకమని భావిస్తోంది.

తెలంగాణలో క్లిక్కవుతుందా?

అసలేమాత్రం బలం లేకుండా.. అభ్యర్థిని చూసి మునుగోడు బరిలో దిగిన బీజేపీ.. బౌలింగ్ గేమ్ ను నమ్ముకుంటూ ముందుకెళ్తోంది. అది సరే కానీ.. తెలంగాణలో అసలు పరిచయమే లేని ఈ గేమ్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందనేది సందేహమే. ఉమ్మడి జిల్లాల వారీగా చూసినా బీజేపీకి ఇప్పటికీ నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని నమ్ముకుని చేరేందుకు ముందుకొచ్చేవారు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది.