Begin typing your search above and press return to search.

బెయిల్ వచ్చిన అఖిల ఇప్పుడేం చేయనున్నారు?

By:  Tupaki Desk   |   24 Jan 2021 6:40 AM GMT
బెయిల్ వచ్చిన అఖిల ఇప్పుడేం చేయనున్నారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని అనుభవించిన భూమా అఖిలప్రియకు తాజాగా బెయిల్ రావటం తెలిసిందే. శుక్రవారమే ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శనివారం సాయంత్రం కానీ ఆమె జైలు నుంచి బయటకు రాలేదు. హైదరాబాద్ విడిచి ఎక్కడకు వెళ్లొద్దన్న కండిషన్ తో ఆమెకు బెయిల్ ఇచ్చారు. ప్రతి వారం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలన్న షరతు విధించారు.

చంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చిన అఖిలప్రియ తొలుత కూకట్ పల్లిలోని తన నివసానికి వెళతారన్న ప్రచారం జరిగింది. అక్కడైతే భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. రెయిన్ ట్రీలో ఫ్లాట్ ఉన్న అఖిలప్రియకు జూబ్లీహిల్స్ లోనూ భారీభవంతి ఉంది. అయితే.. ఆమె మాత్రం కూకట్ పల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్ కు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె.. ఇప్పుడేం చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.

మీడియాతో మాట్లాడతారని భావించినా.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నోరు విప్పని అఖిలప్రియ.. కిడ్నాప్ ఉదంతంపై ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. అయితే.. భూమా వర్గీయులు చెబుతున్న మాటల ప్రకారం చూస్తే.. కొద్ది రోజుల పాటు భూమా అఖిలప్రియ ఏమీ మాట్లాడరని.. మీడియా ముందుకు రారని చెబుతున్నారు. మౌనంగా ఉండటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త భార్గవ్ రామ్.. అతడి అనుచరుడు గుంటూరు శ్రీనులు పరారీలో ఉన్న విషయం తెలిసిందే.