Begin typing your search above and press return to search.

మ‌హానాడు ఉప్పొంగిన స‌ముద్రం.. బాల‌య్య వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   29 May 2022 2:39 AM GMT
మ‌హానాడు ఉప్పొంగిన స‌ముద్రం.. బాల‌య్య వ్యాఖ్య‌లు
X
ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదికా.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే, అన్న‌గారి కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి.. ప్రజలకు ఊపిరి ఆడకుండా చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం భవిష్యత్ విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపూ లేదని.. కేవలం మందు చూపు మాత్రమే ఉందని విమర్శించారు.

జనంజనం కలిస్తే.. ప్రభంజనం అవుతుందని, ఈనాటి మహానాడు.. ఉప్పొంగిన సముద్రంలా కనిపిస్తోందని నందమూరి బాలకృష్ణ అన్నారు.

శక పురుషుడి శత జయంతి రోజున మహానాడును ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

``తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ వచ్చేవారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ నమ్మారు. అందుకే ఎన్టీఆర్‌ పటాన్ని పూజగదిలో పెట్టుకుని ప్రజలు పూజిస్తున్నారు. పేదలు, సామాజిక సమస్యలు ఇతివృత్తంగా ఎన్నో సినిమాలు తీశారు. రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. `` అని బాల‌య్య వ్యాఖ్యానించారు.

నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఊపిరి ఆడకుండా అన్నింటి రేట్లు పెంచిందని ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌.. ఇలా అన్ని రేట్లను ఈ ప్రభుత్వం భారీగా పెంచి.. పేదవాడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఓటు వృథా చేయకు త్వరపడి.. ఓటును సవ్యంగా వేస్తేనే గుడి బడి అని అన్నారు.

ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగుతోందని విమర్శించారు. భావితరాల భవిష్యత్ కోసమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఉంటుందని నందమూరి బాలకృష్ణ తెలిపారు.