Begin typing your search above and press return to search.

అప్పుడు షిండే... ఇప్పుడు విద్యాసాగర్ రావు

By:  Tupaki Desk   |   17 Sep 2019 3:43 PM GMT
అప్పుడు షిండే... ఇప్పుడు విద్యాసాగర్ రావు
X
తెలుగు నేల రాజకీయాల్లోనే కాకుండా యావత్తు దేశ రాజకీయాలను పరిశీలించినా... ఇప్పుడు చోటుచేసుకుంటున్న ఘటన మాత్రం అత్యంత ఆసక్తికరమేనని చెప్పాలి. గవర్నర్ గిరీ పదవీ కాలం పూర్తి చేసుకున్న సీనియర్ రాజకీయవేత్త, బీజేపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి దివంగత ప్రధాని అటల్ బిహరి వాజ్ పేయి సర్కారులో మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు. ఇదేమంత పెద్ద విషయం కాకున్నా.. రాజ్యాంగబద్ధ పదవులను అలంకరించిన తర్వాత కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న విద్యాసాగర్ రావు... గతంలో ఇలాగే గవర్నర్ గిరీ తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చిన సుశీల్ కుమార్ షిండేను గుర్తు చేస్తున్నారనే చెప్పాలి. విద్యాసాగర్ రావు తాజా చర్య... ఈ విషయాన్నే కాకుండా దేశంలో ఇలా చోటుచేసుకున్న రెండు కీలక ఘటనల మధ్య ఎంతటి ఇంటరెస్టింగ్ విషయముందో కూడా తెలియజేస్తున్నారనే చెప్పాలి. సరే... ఇప్పుడు విద్యాసాగర్ రావు, గతంలో షిండేల రీ ఎంట్రీ, ఆ ఎంట్రీల మధ్య ఉన్న పోలికలు ఏమిటో ఓ సారి చూసేద్దాం పదండి.

అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో పలు దఫాలుగా మంత్రి పదవులను దక్కించుకోవడంతో పాటుగా తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన సుశీల్ కుమార్ షిండే... దేశ రాజకీయ చరిత్రలో పెద్దగా పరిచయం లేని నేత కిందే లెక్క. అప్పటికే పార్టీలో ఓ కీలక నేతగా ఉన్న షిండే... 2004లో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అటు కేంద్రంలో మన్మోహన్ సింగ్ సర్కాురు, ఇటు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారే ఉంది. ఏపీ గవర్నర్ గా వచ్చిన షిండే... ఆ పదవికి వన్నె తెచ్చే విధంగానే విధులు నిర్వర్తించారు. అయితే ఏమైందో తెలియదు గానీ... గవర్నర్ గా రెండేళ్లు కూడా పూర్తి చేసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆ పదవి నుంచి వెనక్కు పిలిచింది. గవర్నర్ గిరీ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ అంటే అప్పటిదాకా అరుదే. అయితే షిండేను మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ...గవర్నర్ పదవిని వదిలిన వెంటనే షిండేను కేంద్ర మంత్రిగా చేసేసుకుంది. ఆ తర్వాత యూపీఏ సర్కారు కొనసాగినంతకాలం పాటు షిండే కేంద్ర మంత్రిగానే కొనసాగారు.

సరే... ఇప్పుడు చెన్నమనేని విషయానికి వద్దాం. బీజేపీలో తెలుగు నేలకు చెందిన నేతల్లో కీలక నేతగా ఎదిగిన విద్యాసాగర్ రావు... షిండే మాదిరే కేంద్ర మంత్రిగా కూడా వ్వవహరించారు. వాజ్ పేయి సర్కారులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చెన్నమనేని తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత కొంత కాలం పాటు పెద్దగా జనంలో కనిపించని చెన్నమనేని... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గవర్నర్ గా ఎన్నికయ్యారు. నరేంద్ర మోదీ సర్కారు... చెన్నమనేనిని మహారాష్ట్ర గవర్నర్ గా పంపింది. మహారాష్ట్ర గవర్నర్ గా ఉండగానే... తమిళనాడు ఇంచార్జీ గవర్నర్ గా కూడా చెన్నమనేని వ్యవహరించారు. గవర్నర్ గిరీ తర్వాత చెన్నమనేని రెస్ట్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా బీజేపీ అధిష్ఠానం.. విద్యాసాగర్ రావును తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి లాగేస్తోంది. అందులో భాగంగానే మహారాష్ట్ర గవర్నర్ పదవీ కాలాన్ని ముగించుకున్న చెన్నమనేనిని మరే రాష్ట్రానికి కూడా గవర్నర్ గా పంపకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గవర్నర్ గా పదవీకాలాన్ని ముగించుకుని సొంత నేలకు వచ్చిన చెన్నమనేని ప్రస్తుతం బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. దీంతో గవర్నర్ పదవి చేపట్టిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన రెండో నేతగా చెన్నమనేని రికార్డులకు ఎక్కారు.

ఇక అటు షిండే, ఇటు చెన్నమనేనిలు గవర్నర్ గిరీల తర్వాత కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తే... వారిద్దరి మధ్య చాలా సారూప్యతలున్నాయని చెప్పక తప్పదు. మహారాష్ట్రకు చెందిన షిండే... తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తే.. చెన్నమనేని మహారాష్ట్రకు గవర్నర్ గా వ్యవహరించిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు. అంటే చెన్నమనేని సొంత రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన తర్వాత షిండే యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తే... షిండే సొంత రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన తర్వాత చెన్నమనేని యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంటే వైస్ వర్సా అన్న మాట. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. గవర్నర్ గా వ్యవహరించిన నేతను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి లాగిన హస్తం పార్టీ కాంగ్రెస్ రికార్డులకు ఎక్కితే... ఆ పార్టీ బాటలోనే నడిచిన బీజేపీ కూడా గవర్నర్ గా పనిచేసిన నేతను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి లాగేస్తోందన్న మాట. గవర్నర్ గిరీ తర్వాత షిండే... కేంద్ర మంత్రి వర్గంలో ఓ వెలుగు వెలిగితే... ఆయన బాటలోనే నడుస్తున్న చెన్నమనేని తెలంగాణకు సీఎం అవుతారో, లేదంటే కేంద్రంలో మరే కీలక పదవి చేపడతారో చూడాలి.