Begin typing your search above and press return to search.

'గ్రేటర్' ఫార్ములాతో తెలంగాణను టార్గెట్ చేయనున్న కమలనాథులు

By:  Tupaki Desk   |   6 July 2022 3:44 AM GMT
గ్రేటర్ ఫార్ములాతో తెలంగాణను టార్గెట్ చేయనున్న కమలనాథులు
X
ఇప్పటికే నిరూపితమైన ఫార్ములాతో విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ కారణంతోనే కావొచ్చు.. అధికార టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములాపై బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. మరికొద్ది నెలల్లో జరుగుతాయని అంచనా వేస్తున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ చేతికి అధికారం ఖాయమన్న నమ్మకంలో కమలనాథులు ఉన్నారు. ఇంతకాలం రాష్ట్ర నేతలకు అవకాశం ఇచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం.. ఇప్పుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఢిల్లీ డైరెక్షన్ లో తెలంగాణ రాష్ట్ర పార్టీని నిర్వహించాలని డిసైడ్ చేశారు. అంతేకాదు.. ఎన్నికల నాటికి పార్టీని మరింత విస్తరించేందుకు వీలుగా పలు వ్యూహాత్మక కార్యక్రమాల్ని రచించాలని డిసైడ్ చేశారు.

ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు టీఆర్ఎస్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టటంతో పాటు.. కొంతకాలం క్రితం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన వ్యూహాన్ని పోలి ఉండే ఫార్ములాను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

అధికార టీఆర్ఎస్ చేసే విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టటం.. కీలక సామాజిక వర్గాలకు మరింత చేరువు కావటం.. అవసరమైన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ - మజ్లిస్ మైత్రిని సూక్ష్మస్థాయిలో ఎండటం లాంటి చర్యలతో పాటు.. కేంద్రం ఇస్తున్న నిధులు.. అమలు చేస్తున్న పథకాలపై మరింత ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణను ఒక యూనిట్ గా తీసుకుంటున్న బీజేపీ అగ్రనాయకత్వం.. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో 14 స్థానాల్ని గెలుచుకునేలా జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు క్లస్టర్లుగా వీటిని విభజించింది. అదిలాబాద్.. హైదరాబాద్.. మహబూబ్ నగర్.. వరంగల్ లను యూనిట్లుగా చేసుకొని.. వాటికి కేంద్ర మంత్రుల్ని ఇన్ ఛార్జులుగా నియమించింది. వీరంతా తరచూ తమకు అప్పగించిన లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేంద్రం తరఫున.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తుంటారు. మరి.. గ్రేటర్ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందా? లేదా అన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పాలి.

ఇక.. బీజేపీ టార్గెట్ చేసిన లోక్ సభ స్థానాల్లో కేంద్ర మంత్రులకు ఏయే నియోజకవర్గాల్ని కేటాయించారన్నది చూస్తే..
ఆదిలాబాద్‌, పెద్దపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జి-పురుషోత్తం రూపాలా
జహీరాబాద్‌- నిర్మలా సీతారామన్‌
మెదక్‌- ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ
హైదరాబాద్‌-జ్యోతిరాదిత్య సింధియా
చేవెళ్ల.. మల్కాజ్‌గిరి- ప్రహ్లాద్‌ జోషి
భువనగిరి- దేవీసింగ్‌ చౌహాన్‌
మహబూబ్‌నగర్‌.. నాగర్‌కర్నూల్‌- మహేంద్రనాథ్‌ పాండే
నల్లగొండ- కైలాష్‌ చౌదరి
వరంగల్‌-ఇంద్రజిత్‌సింగ్‌
మహబూబాబాద్‌.. ఖమ్మం- బీఎల్‌ వర్మ