Begin typing your search above and press return to search.

సుజ‌న‌ను వ‌ద‌ల‌ని ఆ కేసు!

By:  Tupaki Desk   |   12 Aug 2022 1:04 PM GMT
సుజ‌న‌ను వ‌ద‌ల‌ని ఆ కేసు!
X
బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రిని మనీలాండ‌రింగ్ కేసు వ‌ద‌ల‌డం లేదు. బ్యాంకుల నుంచి వంద‌ల కోట్ల రూపాయ‌లు తీసుకుని ఎగ్గొట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై గ‌తంలోనే కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికే సుజ‌నా చౌద‌రి టీడీపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

మొత్తం రూ.5,700 కోట్ల మనీలాండరింగ్, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి నవంబర్ 2018 లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్, ఢిల్లీలోని సుజనా చౌదరి నివాసం, కార్యాలయాలతో సహా ఎనిమిది చోట్ల‌ సోదాలు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సోదాల్లో సుజ‌నా చౌద‌రి గ్రూప్ కంపెనీలు రూ.5700 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేశాయని తేలింది.

ఈ నేప‌థ్యంలో సుజనా చౌదరి ఆగ‌స్టు 12న‌ చెన్నైలోని ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. రూ.363 కోట్ల బ్యాంక్ బకాయిల వివాదంలో విచారణకు ఎంపీ సుజనా చౌదరి హాజరయ్యారు. మూడు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆయ‌న‌పై అభియోగాలున్నాయి. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) తేల్చింది. మనీలాండరింగ్ చట్టం కిందే తాజాగా సుజనా చౌదరికి చెన్నై కోర్టు నోటీసులు జారీ చేసింది.

మూడు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు సుజ‌నా చౌద‌రిపై ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి అందిన ఫిర్యాదులను పురస్కరించుకుని సీబీఐ ఇదివరకే ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసింది.

సుజనా ఆధ్వర్యంలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ (చెన్నై) తమ బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని మూడు బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. సుజ‌నా చౌద‌రి రుణం పొందే క్ర‌మంలో తమకు త‌ప్పుడు స్టేట్మెంట్లు, అకౌంట్లు సమర్పించినట్టు ఈ బ్యాంకులు పేర్కొన్నాయి. తమకు ఆయ‌న నుంచి 363 కోట్ల రుణం రావాల్సి ఉంద‌ని తెలిపాయి.

సుజ‌నా చౌద‌రికి చెందిన కంపెనీ...సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ.159 కోట్ల అప్పు తీసుకున్నట్టు స‌మాచారం. దీని ఆధారంగా చెన్నైలోని ఈడీ కార్యాలయం మనీలాండరింగ్ నివారణ చట్టం కింద విచార‌ణ మొదలుపెట్టింది. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్న ఈ సంస్థ ఆఫీసులకు సంబంధించి దర్యాప్తు చేప‌ట్టింది.