Begin typing your search above and press return to search.

ఈ స్టేడియం పైనే బీసీసీఐకి మోజు ఎందుకు?

By:  Tupaki Desk   |   29 May 2023 5:00 PM GMT
ఈ స్టేడియం పైనే బీసీసీఐకి మోజు ఎందుకు?
X
ఐపీఎల్‌ –2023 చివరి అంకానికి చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మే 28న జరగాల్సి ఉంది. అయితే వర్షం కురియడంతో ఫైనల్‌ మ్యాచ్‌ మరుసటి రోజు మే 29కి వాయిదా పడింది. దీంతో భారీ ఎత్తున టికెట్లు కొని మ్యాచ్‌ ను వీక్షించాలని ఆశపడ్డ ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. మే 29న కూడా మ్యాచ్‌ జరగడానికి వీలు లేకపోతే రెండు టీములను విజేతలుగా ప్రకటిస్తారు. కాగా ఇప్పటివరకు ఇద్దరిని విజేతలుగా ప్రకటించే పరిస్థితి రాలేదు.

మరోవైపు ఫైనల్‌ మ్యాచ్‌ గుజరాత్‌ లో అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్‌ లో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఈ స్టేడియం పెద్దది. ఏకంగా 1.32 లక్షల ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యముంది. 1982లో నిర్మించిన అహ్మదాబాద్‌ లోని మోతేరా స్టేడియాన్ని 2020లో పునర్నిర్మించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పేరు దానికి పెట్టారు. దీనిపైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 2020 ఫిబ్రవరి 4న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ స్టేడియాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కాగా కీలక మ్యాచులన్నింటిని గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో పెట్టడంపైన చర్చ జరుగుతోంది. గుజరాత్‌ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రం. అలాగే భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా అమిత్‌ షా కుమారుడు జై షా వ్యవహరిస్తున్నారు. దీంతో సహజంగానే ఐపీఎల్‌ కీలక మ్యాచులకు గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ వేదికగా మారింది.

ఈ ఏడాదే కాదు గతేడాది కూడా ఐపీఎల్‌ ఫైనల్‌ అహ్మదాబాద్‌ లోనే జరిగింది. ఇది అడ్వాంటేజ్‌ గా మారి గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ గెలుపొందింది. ఇప్పుడు కూడా ఫైనల్‌ అహ్మదాబాద్‌ లోనే పెట్టడంతో కొందరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. ఈ ఏడాది కూడా గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ కు చేరుకోవడం.. సొంత స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుండటం ఆ టీమ్‌ కు సానుకూలాంశంగా మారుతుందని అంటున్నారు.

కేవలం ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రమే కాకుండా ఈ సీజన్లో ఐపీఎల్‌ తొలి మ్యాచ్, క్వాలిఫైయర్‌–2 మ్యాచ్‌ కూడా అహ్మదాబాద్‌ లోనే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అహ్మదాబాద్‌ స్టేడియం పట్ల బీసీసీఐకి ఇంత ప్రేమ ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుజరాత్‌ సొంత టీమైన గుజరాత్‌ టైటాన్స్‌ కు లబ్ధి కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎన్నో మైదానాలు ఉండగా గుజరాత్‌ లోనే మ్యాచ్‌ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం.. గత సీజన్లో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీని గెలుపొందిన నేపథ్యంలో ఈసారి తొలి మ్యాచ్‌తో పాటు, ఫైనల్‌ ను అక్కడే నిర్వహించాలి. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్‌ లో మ్యాచ్‌ లు నిర్వహించామని ఐపీఎల్‌ వర్గాలు చెబుతున్నాయి.