Begin typing your search above and press return to search.

సచిన్ కుమారుడికి ఎంత కష్టం.. గోవాకు ఆడేందుకు సిద్ధం

By:  Tupaki Desk   |   13 Aug 2022 12:30 AM GMT
సచిన్ కుమారుడికి ఎంత కష్టం.. గోవాకు ఆడేందుకు సిద్ధం
X
తండ్రి ఎంత మేరు నగధీరుడైతేనేం..? ఆయనకు ఎంతటి పేరు ప్రఖ్యాతులుంటేనేం..? అడుగుల్లో అడుగు వేసి నడిచినంతనే ఆ స్థాయి వచ్చేయదు.. అసలు తండ్రి వారసత్వం, సత్తా, ప్రతిభ రావాలనుకోవడం అత్యాశే. కాకపోతే, ఆ పేరును కాస్తయినా నిలబెట్టే ప్రయత్నం, అందుకునేంత ప్రతిభ ఉండాలి.

ఆ రెండూ లేకుంటే రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా, క్రికెట్వంటి క్రీడా రంగంలో అయినా ఓ స్థాయితో ఆగిపోక తప్పదు. ఉదాహరణకు ముఖ్యమంత్రులు సహా రాజకీయాల్లో ఎందరో తండ్రులు పిల్లలను తమ బాటలోకి తీసుకొచ్చారు. అయితే, తండ్రి ముఖ్యమంత్రి అయినా.. కుమారులు లేదా కుమార్తెలు ఆ స్థాయిని అందుకోలేక పోయారు.
తెలుగు రాష్ట్రాల్లో తండ్రి స్థాయిలో రాజకీయాల్లో రాణించి సీఎం అయినది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఒడిశాలో బిజూ పట్నాయక్ కుమారుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు. యూపీలో ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ సీఎం అయ్యారు. బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ప్రయత్నాల్లో ఉన్నారు. క్రీడా రంగంలో అయితే భారత్ లో ఎంతో ప్రసిద్ధి అయిన క్రికెట్ గురించే ముందు చెప్పుకోవాలి.

గావస్కర్ కూ తప్పలేదు పుత్ర కష్టాలు

భారత క్రికెట్ లో మొట్టమొదటి సూపర్ బ్యాట్స్ మన్ ఎవరంటే సునీల్ గావస్కర్. అరివీర భయంకర వెస్టిండీస్ బౌలర్లను కనీసం హెల్మెట్ కూడా లేకుండా ఎదుర్కొన్న ఘనత గావస్కర్ ది. టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ అతడే. కానీ, తన కుమారుడు రోహాన్ గావస్కర్ మాత్రం తండ్రి సాధించినదాంట్లో ఒక వంతు కూడా అందుకోలేకపోయాడు. అప్పటికీ అతడు ముంబై వంటి పెద్ద పోటీ ఉండే జట్టును వదిలి బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించినా టీమిండియాకు ఎక్కువ మ్యాచ్ ల్లో ఆడలేకపోయాడు. చివరకు ఓ సాదాసీదా ఆటగాడిగా కెరీర్ ను ముగించాడు.

సచిన్ ఎంత ప్రయత్నించినా..

ఆధునిక భారత క్రికెట్ ను జన రంజకం చేసిన అతి గొప్ప ఆటగాడు సచిన్ టెండూల్కర్. రేడియోల్లో వినడమే తప్ప గావస్కర్ ప్రతిభా పాటవాలను టీవీల్లో కళ్లారా చూసే అవకాశం ఒక తరం వారికి కలగలేదు. కానీ, సచిన్ కు అలాకాదు. టీవీ తెరపై అదీ రంగుల టీవీల్లో సచిన్ విన్యాసాలను వీక్షించే భాగ్యం 1990, 2000, 2010 దశకం వారికి దొరికింది. అయితే, 16 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి వచ్చి.. 200 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించి దాదాపు 16 వేల పరుగులు చేసిన సచిన్.. 463 వన్డేల్లో్ 18 వేల పరుగులు చేసిన సచిన్.. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ టీమిండియాకు ఆడేలా చేసేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాడు.

ఎంత ప్రోత్సాహం ఉంటేనేం..? ప్రతిభ ఉండాలి కదా?

అర్జున్ టెండూల్కర్ ను వ్యక్తిగతంగా తప్పుబట్టడం కాదు కానీ.. అతడిపై క్రికెట్ ను బలవంతంగా రుద్దుతున్నారా? అని అనిపిస్తుంది ఒక్కోసారి. అర్జున్ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు. ఐదారేళ్లుగా భారత క్రికెట్ లో అతడి పేరు నానుతోంది. అండర్ 19 టీమిండియా కు ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అతడిని కొనుక్కుంది. కానీ, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇక ముంబై తరఫున దేశవాళీల్లో అవకాశం అంటే అది చాలా కష్టం. దీంతో అతడు ముంబయిని వీడబోతున్నాడు. వచ్చే దేశవాళీ సీజన్‌ నుంచి గోవా తరఫున ఆడబోతున్నాడు. అందుకోసం ముంబయి క్రికెట్‌ సంఘాన్ని ఎన్ వోసీ అడిగాడు. ఎడమ చేతి వాటం పేస్ బౌలింగ్ ఆల్ రౌండరైన అర్జున్.. 2020-21 సీజన్లో ముస్తాక్‌ అలీ టోర్నీలో ముంబైకి రెండు మ్యాచ్ల్ ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ప్రతిభ చాటుకోలేకపోయాడు.

ముంబైకి ఆడే స్థాయి అందుకోవాలంటే..?

ప్రథ్వీ షా, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ వంటి యువ క్రికెటర్లున్న ముంబైకి ఆడడం అంటే అంత సులువు కాదు. బౌలింగ్ లో నూ మోహిత్ అవస్థి, తుషార్ దేశ్ పాండే, ధావల్ కులకర్ణి వంటి పేసర్లు ముంబై సొంతం. అలాంటి జట్టులో అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులో అవకాశం రావడం అంటే కష్టసాధ్యమే. ఇలాగైతే టీమిండియాకు కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేడు. దీంతో అర్జున్ ఈ ఏడాది నుంచి గోవాలాంటి చిన్న జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. అక్కడైతే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కుతుందని భావిస్తున్నాడు.

అయితే, దీనిపై గోవా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సూరజ్‌ లోట్లీకర్‌ మరో రకంగా స్పందించాడు. ‘‘లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేసే బౌలర్‌ కోసం చూస్తున్నాం. అంతేకాక మిడిలార్డర్‌లో ఆల్‌రౌండ్‌ సత్తా ఉన్న వాళ్ల కోసం వెతుకుతున్నాం. అందుకే అర్జున్‌ తెందుల్కర్‌ని మా జట్టులో చేరమని ఆహ్వానించాం. ముందుగా కొన్ని ట్రయల్‌ మ్యాచ్‌ల్లో అతణ్ని ఆడిస్తాం. ప్రదర్శనను బట్టి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు’’అని సర్దుబాటుగా చెప్పాడు. వాస్తవం మాత్రం వేరే అని తెలిసిపోతోంది.