Begin typing your search above and press return to search.

ఆఫ్ఘన్లో భారతీయులే అసలు టార్గెట్టా ?

By:  Tupaki Desk   |   20 July 2021 7:36 AM GMT
ఆఫ్ఘన్లో భారతీయులే అసలు టార్గెట్టా ?
X
ఆఫ్ఘనిస్ధాన్ నుండి అగ్రరాజ్యం నేతృత్వంలోని నాటో దళాలు వెళిపోయిన తర్వాత విచిత్రమైన పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఒకవైపు ఆప్ఘన్ మిలిట్రీ, మామూలు పోలీసులతో పాటు మామూలు జనాలను కూడా తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రాజెక్టులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్ నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి. ఇంతకీ ఆఫ్ఘన్లోని తాలిబన్ల టార్గెట్లు ఎవరంటే భారత్ ప్రాజెక్టులనే అని స్పష్టంగా తెలిసిపోతోంది.

2001 నుండి ఆప్ఘన్ పునర్నిర్మాణంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు సుమారు 300 కోట్ల డాలర్లు విలువైన అనేక ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఆప్ఘన్ పార్లమెంటు భవనాన్ని కూడా భారతే నిర్మించింది. వివిధ ప్రాజెక్టులను పూర్తిచేయటంలో భాగంగా భారత్ కు చెందిన వేలాదిమంది అక్కడ నివాసముంటున్నారు. ఇపుడా ప్రాజెక్టులపైనే తాలిబన్ల దృష్టిపడిందట.

అయితే భారత్ ప్రాజెక్టులపై డైరెక్టుగా తాలిబన్ల రూపంలో కాకుండా పాకిస్ధాన్ దృష్టి పెట్టిందని సమాచారం. ఆప్ఘన్లోని చాలా ప్రావిన్సుల్లో స్కూళ్ళు, కాలేజీలు, రోడ్లు, ఆఫీసు భవనాల్లాంటివి చాలా నిర్మాణాలు జరిగాయి. ఇంకా అనేక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటిని ధ్వసం చేయటమే పాకిస్ధాన్ టార్గెట్ గా పెట్టుకుందని సమాచారం. ఐఎస్ఐ ఆధ్వర్యంలో సుమారు 10 వేలమంది సాయుధులు పాకిస్ధాన్ నుండి ఆప్ఘనిస్ధాన్ కు చేరుకున్నట్లు భారత్ నిఘావర్గాలు గమనించాయి.

అంటే తాలిబన్ల అనుమతితోనే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు సుమారు 10 వేలమంది ఆప్ఘన్లోకి ప్రవేశించేశారు. వీళ్ళల్లో ఎవరు ఎప్పుడు ఏ ప్రాజెక్టులపై దాడులు చేస్తారో ? ఎంతమందిని చంపుతారో ? ఎవరిని బంధీలుగా పట్టకుంటారో తెలీక భారతీయుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. గతంలో కూడా కొందరు బారతీయులను తాలిబన్లు బంధీలుగా పట్టుకుని చంపేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. తాలిబన్ల తాజా వైఖరితో ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది.