Begin typing your search above and press return to search.

50 ఏళ్ల నాటి ప్రణాళికలే తెలంగాణను అస్తవ్యస్తం చేస్తున్నాయా?

By:  Tupaki Desk   |   30 Nov 2022 12:30 AM GMT
50 ఏళ్ల నాటి ప్రణాళికలే తెలంగాణను అస్తవ్యస్తం చేస్తున్నాయా?
X
దేశంలో వివిధ రాష్ట్రాలతోపాటు తెలంగాణలో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే వాటి అభివృద్ధిలో అత్యంత కీలకమైన మాస్టర్‌ప్లాన్‌ల రూపకల్పనలో ఉదాసీనత వ్యక్తమవుతోంది. ఇప్పటికీ కాలం చెల్లిన ప్రణాళికలే నగరాలు, పట్టణాల్లో అమలవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో మొత్తం 13 నగరపాలక, 128 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో 80కి పైగా పట్టణాలు, నగరాలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లను అందుబాటులోకి తేవాల్సి ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ అతిపెద్ద నగరంగా ఉంది. అయితే ఇక్కడ 1972 నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉందని తెలుస్తోంది. అదేవిధంగా మరో నగరం నిజామాబాద్‌లో సైతం 1974 నాటి ప్రణాళికే ఉందని సమాచారం. తెలంగాణలో పదికిపైగానే మున్సిపాలిటీల్లో 1990 కంటే ముందు నాటి మాస్టర్‌ప్లాన్‌లే అమల్లో ఉన్నాయి.

కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో నాలుగేళ్లు పూర్తవుతున్నా బృహత్‌ ప్రణాళికల రూపకల్పన జరగడం లేదు. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి, పట్టణాలకు వలస వచ్చే ప్రజలు ఇలా వివిధ కారణాల నేపథ్యంలో పట్టణాల్లో ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంస్థలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రణాళికలు ముందుకు సాగడం లేదని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 10 అమృత్‌ పట్టణాలకు కొత్తగా మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించినా అవి అమలుకు నోచుకోలేదని చెబుతున్నారు. పెరుగుతున్న జనాభా, ప్రాంతాల విస్తరణకు అనుగుణంగా కనీసం 20 ఏళ్లకోసారి మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణాలు నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తేనే కేంద్రం వాటిని అమృత్‌ పథకం పరిధిలోకి చేరుస్తుంది.

రాష్ట్రంలోని 141 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు మాస్టర్‌ప్లాన్‌ల రూపకల్పనకు అనుమతి లభించింది. దీంతో వీటిలో 23 ఆ ప్రక్రియను చేపట్టాయి. వీటిలో ఎనిమిది ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపాయి. అయితే పెద్దపల్లి పురపాలక సంఘం మాస్టర్‌ప్లాన్‌కు మాత్రమే ఆమోదం లభించింది.

సాధారణంగా కొత్త పురపాలక సంఘం ఏర్పాటైతే నాలుగు సంవత్సరాలలోపు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 59 పురపాలక సంఘాలు ఏర్పాటై నాలుగు సంవత్సరాలు దాటినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం.

10 లక్షలకు మించిన జనాభా ఉన్న వరంగల్‌లో 50 ఏళ్ల నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం కొత్తది రూపొందించి కార్పొరేషన్‌ తీర్మానంతో దాన్ని ప్రభుత్వానికి పంపినా దానికి ఆమోదం ఇప్పటికీ రాలేదు. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌ కూడా 48 ఏళ్ల నాటిది కావడం గమనార్హం. ఇక్కడ కూడా మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా స్థాయిని దాటి ముందుకు వెళ్లలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.