Begin typing your search above and press return to search.

ఏమైనా ఇలాంటివి జగన్ సర్కారుకే సాధ్యమట!

By:  Tupaki Desk   |   29 Jun 2022 3:13 AM GMT
ఏమైనా ఇలాంటివి జగన్ సర్కారుకే సాధ్యమట!
X
ఒక్కసారి.. ఒకే ఒక్కసారి అవకాశమిస్తే తానేమిటో చూపిస్తానంటూ కాలికి బలపం కట్టుకొని మరీ ఏపీ మొత్తం తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిన ఏపీ ప్రజలకు.. గడిచిన మూడేళ్లుగా ఆయనేమిటన్న విషయం మీద సంపూర్ణ అవగాహన కలిగిందని చెప్పక తప్పదు. ఒక్కసారి పవర్ లోకి వచ్చే మరో మూడు టర్మ్ లు అలానే కంటిన్యూ అయ్యేలా సంక్షేమ పథకాల్ని ప్లాన్ చేసిన సీఎం జగన్ పుణ్యమా అని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా మారిందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

అయితే.. ఇదంతా ఎల్లో మీడియా.. ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ఆరోపణలు తప్పించి మరింకేమీ లేదన్న ఆగ్రహాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మంత్రులైతే.. ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని సమర్థించుకుంటూ సమాధానాలు ఇస్తున్నారు. అప్పులు మేమే చేస్తున్నామా? చంద్రబాబు ప్రభుత్వం చేయలేదా? అంటూ విరుచుకుపడుతున్న వారు.. అప్పులు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి కానీ.. అప్పు రాకపోతే బతకలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారన్న ఆరోపణలపై మాత్రం సూటి సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నారు.

ప్రతి మంగళవారం అప్పు కోసం పరుగులు తీయటం తప్పించి.. మరింకో పని లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గడిచిన మూడు నెలలుగా జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులుగా మారుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదలైన మూడు నెలల్లోనే జగన్ సర్కారు చేసిన అప్పు అక్షరాల రూ.20,190 కోట్లుగా చెబుతున్నారు. ఇదంతా బయటకు కనిపించిన అప్పులు మాత్రమేనని.. బయటకు రాకుండా గుట్టుగా చేస్తున్న అప్పుల గురించి బయటకు సమాచారం రావటం లేదన్న మాట వినిపిస్తోంది. దీంతో.. మొత్తం అప్పు ఎంతన్న దానిపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావటానికి కాస్త ముందే రాష్ట్ర ప్రభుత్వానికి తనకు తాను సొంతంగా జనరేట్ చేసుకుంటున్న ఆదాయం రూ.12వేల కోట్ల వరకు వస్తోంది. ఇది సరిపోక.. మరో రూ.10వేల కోట్లు (సరాసరిన) అప్పు చేయటం ఆందోళనకు గురి చేస్తోంది. అంటే మూడు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.36వేల కోట్లు అయితే.. చేసిన అప్పు రూ.30వేల కోట్లు. ఇంత భారీగా నిధులు చేతికి వచ్చినా.. ఖజానా మాత్రం ఎప్పటిలాగే చిల్లి గవ్వ లేని దుస్థితి.

తాను అనుకున్నట్లుగా పలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న జగన్ సర్కారు.. మొదట్లో మాదిరి కాకుండా ఈ మధ్యన పథకాల లబ్థిదారుల సంఖ్యలోనూ కోత పెట్టేస్తున్న వైనం కనిపిస్తోంది. ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఉంటే తప్పించి.. పథకాల లబ్ధిదారుల సంఖ్యను కుదించేయటం చూస్తేనే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలే గడుస్తున్నా.. కేంద్రం విధించిన పరిమితిలో సింహ భాగాన్ని ఇప్పటికే తెచ్చేసుకున్న వైనం చూస్తే.. మిగిలిన తొమ్మిది నెలలు పాలనా రథాన్ని ఎలా నడుపుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.28 వేల కోట్లు అప్పు తెచ్చుకోవటానికి అనుమతి ఇస్తే.. ఇప్పటికే రూ.25,800 కోట్లు అప్పు తెచ్చేశారు. అదే సమయంలో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన రూ.8300 కోట్ల అప్పును మాత్రం చూపించలేదన్న విమర్శ ఉంది.

ఒకవేళ ఈ రూ.8300 కోట్ల అప్పును మినహాయించిన ఈ మూడు నెలల్లో తీసుకున్న అప్పు రూ.17500 కోట్లు అవుతుంది. అంటే.. తీసుకోవాల్సిన రుణ పరిమితిలో యాభై శాతానికి పైనే మొత్తాన్ని.. కేవలం మూడు నెలల వ్యవధిలోనే తీసుకోవటం అంటే.. మిగిలిన 9 నెలల మాటేమిటన్నది అసలు ప్రశ్న. వెనుకా ముందు చూసుకోకుండా తీసుకొస్తున్న అప్పు కొండలా పెరిగిపోతున్న వేళ.. దాని మీద అయ్యే వడ్డీని తీర్చటానికి రానున్న రోజుల్లో ఏపీ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది.