Begin typing your search above and press return to search.

ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం: ఏపీ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   24 Sep 2021 1:30 PM GMT
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం: ఏపీ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
X
ఒకటి కాదు.. రెండు కాదు.. నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వివిధ అంశాలపై న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీటీడీ పాలకమండలిలో నిబంధనలకు విరుద్ధంగా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఇచ్చిన జీవోలపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు చెల్లించకపోవడంపై కూడా కోర్టు పలుమార్లు ఆగ్రహించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి కూడా కోర్టులో చుక్కెదురైంది.

ఎయిడెడ్ విద్యాసంస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వంలోకి తీసుకునేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది సరైంది కాదని న్యాయస్థానం పేర్కొంది.

ఎయిడెడ్ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటీషనర్ తరుఫు న్యాయవాది విజయ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను పిటీషనర్ కోర్టుకు ఇవ్వడంతో హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే ఏకంగా ఈనెల 29న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును 29కు వాయిదా వేసింది.