Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు మరో దిమ్మ తిరిగే షాక్.. ఆ స్టేట్ లోనూ మాటాషేనా?

By:  Tupaki Desk   |   20 July 2021 11:47 AM GMT
కాంగ్రెస్ కు మరో దిమ్మ తిరిగే షాక్.. ఆ స్టేట్ లోనూ మాటాషేనా?
X
మాటలు మాటలే.. చేతలు చేతలే. చెప్పే మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరించటం మోడీషాలకు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పాలి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం.. అవి ఒకసారి పూర్తి అయ్యాక ప్రజల సంక్షేమం.. పాలన తప్పించి మరింకేమీ ఉండదని చెప్పే మాటలు విన్నప్పుడు.. వావ్ ఎంతటి ఉన్నత రాజకీయ పరిణితి అన్న భావనకు గురి కావటం ఖాయం. ఓవైపు మాటలు చెబుతూనే.. మరోవైపు తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావటానికి ఏమైనా చేయటానికి సిద్ధమన్నట్లుగా వ్యవహరించే బీజేపీ.. తాజాగా మరో బుల్లి ఈశాన్య రాష్ట్రాన్ని టార్గెట్ చేసింది.

మోడీ చెప్పే నీతులు నీళ్ల మూటలన్న విషయం.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు స్పష్టంగా చెప్పేశాయి. పవర్ కోసం మోడీషాలు ఎంతవరకు వెళతారన్న విషయం దేశంలోని చిన్నపిల్లాడికి సైతం అర్థమయ్యేలా చేసిన తీరుతో చాలామంది అవాక్కు అయ్యారు. పవర్ మీద మోజు ఉండటం ఓకే కానీ... మరీ ఇంత వ్యామోహమా? అన్న ప్రశ్న కోట్లాది మంది మదిలో మెదిలింది.

మోడీషాలు ఎన్ని ఎత్తులు వేసినా.. చివరకు బెంగాల్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది తెలిసిందే. ఇలాంటి ఎదురుదెబ్బల్ని ఎప్పటికప్పుడు మర్చిపోవటం.. తాము అధికారంలో లేని రాష్ట్రంలో పవర్ కోసం ప్రయత్నించటం.. పవర్ చేతిలో ఉన్న రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జరిగే ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉంటాయన్నది బీజేపీ తీరును చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. మోడీ ఎప్పుడైతే కేంద్రంలోకి అడుగు పెట్టారో.. ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవటం షురూ చేశారు.

తాజాగా ఇప్పుడా పార్టీ కన్ను మణిపూర్ మీద పడింది. వచ్చే ఏడాదిలో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు భారీ ప్లాన్ వేశారు. ఎవరినో టచ్ చేయటం ఎందుకు.. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే టార్గెట్ చేసిన వారు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ పదవికి రాజీనామా చేసేసి బీజేపీలో చేరారు. అంతేనా.. తనతో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఆయన బీజేపీలోకి తీసుకెళ్లిపోయారు.

అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళలో.. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా పార్టీకి కోలుకోలేని దెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు. గోవిందాస్ మామూలోడు కాదు.. బిష్నాపూర్ అసెంబ్లీ నుంచి వరుస పెట్టి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నెల క్రితం వరకు రాష్ట్రంలో పవర్ లో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మీద తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరటం సంచలనంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమకు విజయ అవకాశాలు ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు తాజా పరిణామం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏమైనా.. మోడీ ప్రభ తగ్గుతున్నట్లుగా మీడియాలో వస్తున్నా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అంతకంతకూ బలపడే పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.