Begin typing your search above and press return to search.

బట్టల్లేకుండా బ్రిడ్జి కింద పడిన ఆమె ఎవరో తేలిపోయింది

By:  Tupaki Desk   |   3 April 2020 12:30 AM GMT
బట్టల్లేకుండా బ్రిడ్జి కింద పడిన ఆమె ఎవరో తేలిపోయింది
X
కరోనా కలకలంతో చాలా విషయాల్ని మర్చిపోయాం. అందరి చూపు ఇప్పుడు కరోనా.. లాక్ డౌన్ మీదనే తప్పించి.. మరేమీ పట్టట్లేదు. ఇలాంటివేళలో.. మిస్టరీగా మారిన కేసుల లెక్క తేల్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారి.. మరో దిశ ఘటనగా పలువురు అభివర్ణించిన ఉదంతం గుర్తుకు వచ్చిందా?

చేవెళ్ల పరిధిలోని తుండగపల్లి గ్రామ బ్రిడ్జి కింద ఒంటి మీద బట్టల్లేకుండా.. ముఖమంతా ఛిద్రమైన మహిళకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేధించారు. ఆమెను అత్యంత దారుణంగా చంపింది ఆమె ప్రియుడేనని తేల్చారు. ఫేస్ బుక్ పరిచయం.. వివాహేతర సంబంధం.. చివరకు ఆమెను అంత దారుణంగా మరణించటానికి కారణంగా భావిస్తున్నారు. పోలీసుల విచారణకు సంబంధించి కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. పోలీసు వర్గాలు అందిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదరు మహిళది సిక్కిం. ఆమెకు భర్త.. పిల్లలు ఉన్నారు. భర్త వ్యాపారవేత్త. బాగా సంపన్న కుటుంబం.

ఆర్నెల్ల క్రితం ఆమెకు ఫేస్ బుక్ లో ముంబయికి చెందిన ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజుల్లోనే వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అది కాస్తా హద్దులు దాటేసింది. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రియుడ్ని కలిసేందుకు ఆమె సిక్కిం నుంచి ముంబయికి వెళ్లేది. అలా వారి మధ్య పెరిగిన సంబంధం నేపథ్యంలో భర్తను వదిలేసి.. ప్రియుడితోనే ఉండిపోవాలని భావించింది.

ఎప్పుడూ తనతోనే ఉండాలని.. తనను వదిలి ఎక్కడికి వెళ్లొద్దని.. ఎవరిని కలవొద్దని ప్రియుడి మీద సదరు మహిళ ఆంక్షలు పెట్టేది. దీంతో.. ఆమె తీరును భరించలేని ఆ యువకుడు ఆమె అడ్డు తొలగించుకోవాలని చూశాడు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడికి ఫోన్ చేసి సాయం కోరాడు. మార్చి 15న ప్రియురాలి తో కలిసి ముంబయి నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చారు.

ఒక అద్దె కారును తీసుకొని లాంగ్ డ్రైవ్ కు వెళుతున్నట్లు నమ్మించాడు. ఆమెను.. స్నేహితుడ్ని వెంటపెట్టుకొని కారులో బయలుదేరి.. వికారాబాద్ సమీపంలో తాను అనుకున్న ప్లాన్ ను అమలు చేశాడు. అయితే.. ప్రియుడ్ని పూర్తిగా నమ్మిన ఆమె.. తన ప్రాణాల మీదకు వస్తున్న ముప్పును గుర్తించలేకపోయింది. తన వెంట తెచ్చుకున్న నైలాన్ తాడుతో ఆమె మెడకు ఉరి బిగించి.. హత్య చేశాడు.

అనంతరం కారులో డెడ్ బాడీని తంగడపల్లి శివారుకు తీసుకెళ్లి.. స్నేహితుడి సాయంతో బ్రిడ్జ్ కిందకు పడేశాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు వీలుగా ముఖాన్ని రాయితో చిద్రం చేశారు. ఆధారాలు లేకుండా ఉండేందుకు బట్టలు పూర్తిగా తొలగించారు. అద్దె కారు.. సీసీ ఫుటేజ్ సాయంతో నిందితుడి స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఏదైనా మితానికి మించి అతి అయితే.. పరిస్థితులు ఎలా మారతాయనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.