Begin typing your search above and press return to search.

బాబు రాజు - యనమల సేనాపతి..ఏ రాజ్యానికంటే?

By:  Tupaki Desk   |   25 Jan 2020 3:03 PM GMT
బాబు రాజు - యనమల సేనాపతి..ఏ రాజ్యానికంటే?
X
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడులపై వైసీపీ కీలక నేత - మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదిరిపోయే సెటైర్ సంధించారు. చంద్రబాబును రాజుగా, యనమలను సేనాధిపతిగా పేర్కొన్న అనిల్... మోసం అనే రాజ్యానికే వారు అధిపతులంటూ అదిరిపోయే సెటైర్ సంధించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్... రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల అంటూ నిప్పులు చెరిగారు. మోసాలు - కుట్రలు చేసిన ఆయన ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనే భ్రమలో యనమల ఉన్నారని దుయ్యబట్టారు.

మొన్నటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటన చేసిన సందర్భగా మంత్రులు తాగి వచ్చారని యనమల చేసిన వ్యాఖ్యలను అనిల్ తప్పుబట్టారు. దావోస్‌ వెళ్ళి చంద్రబాబు - యనమల ఏమి సాధించుకొచ్చారని ప్రశ్నించిన అనిల్... ప్రజల సొమ్ముతో విహార యాత్రలు చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు - యనమల ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అతితక్కువ కాలంలోనే ‘బెస్ట్‌ పెర్‌ ఫార్మింగ్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిస్తే... అవినీతిలో చంద్రబాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారన్నారు.

‘మండలిలో ఏదో సాధించినట్లు చంద్రబాబు - లోకేశ్ లు సన్మానాలు చేయించుకుంటున్నారు. మండలి రద్దు చేస్తే శాసనసభ ఎందుకని యనమల అంటున్నారు. గతంలో ప్రజా మద్దతు లేని మండలి అవసరం లేదని ఎన్టీఆర్ అన్నారు. 2004లో కౌన్సిల్ వల్ల ప్రజాధనం వృధా అని చంద్రబాబు విమర్శలు చేశారని’ అనిల్‌ గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ సహకరించక పోయినా పర్వాలేదని.. కానీ అడ్డుకుంటే మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారంటూ యనమల ఆరోపణలను మంత్రి అనిల్‌ తిప్పికొట్టారు. గతంలో వైస్రాయ్‌ హోటల్ లో జరిగిందేమిటో యనమల సమాధానం చెప్పాలని అనిల్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.