Begin typing your search above and press return to search.

సర్దుకోకపోతే అంతే సంగతులా... ?

By:  Tupaki Desk   |   20 Jan 2022 4:30 PM GMT
సర్దుకోకపోతే అంతే సంగతులా... ?
X
రాజకీయాల్లో ఉన్న వారు ఎపుడూ అలెర్ట్ గా ఉండాలి. ఏ వైపు నుంచి ఏ ప్రళయం ముంచుకువస్తుందో భగవంతుడు కూడా కనలేడు. అందుకే ఈ రోజే యుద్ధం అన్నా కూడా రెడీ అన్నట్లుగా ఉండాలి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎపుడూ అప్రమత్తంగా ఉంటారు. ఆయన అన్ని వైపుల నుంచి చూసుకుంటూ జాగ్రత్త పడతారు. ఇదంతా ఎందుకు అంటే దేశంలో ఇపుడు ముందస్తు ఎన్నికల సంకేతాలు అన్నవి గట్టిగానే ఉన్నాయి అంటున్నారు. ఉత్తరాదిలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ తతంగం అంతా కూడా మార్చి మొదటి వారానికల్లా పూర్తి అవుతుంది.

ఇక మార్చి 10న రిజల్స్ట్స్ వస్తాయి. మరి అవి ఎవరికి ఫేవర్ గా ఉంటాయో తెలియదు. అయితే అటు బీజేపీ కూడా పట్టుదల మీద ఉంది. ఇటు విపక్ష కూటమి కూడా గట్టిగా ఉంది. ఎవరికి మెజారిటీ వచ్చినా దేశంలో సీన్ మరుతుంది అంటున్నారు. మొత్తం అయిదు రాష్ట్రాలలో బీజేపీకి బాగా ఆశలు ఉన్నవి యూపీ, ఉత్తరాఖండ్, గోవా మణిపూర్ లలో ఏదో ఒకటి వచ్చి తమ ఒడిలోకి వాలకపోతుందా అన్న ఆశ కూడా ఉందిట. అంటే అయిదింట మూడు రాష్ట్రాలు గెలుచుకుంటే కనుక బీజేపీ పులి అయిపోవడం ఖాయం.

ఆ హుషార్ లో బీజేపీ ముందస్తు ఎన్నికల‌కు సై అన్నా కూడా ఆశ్చర్యం లేదు అంటున్నారు. విపక్షాలు జోరు చేయకుండా కూటమి బలం పుంజుకోకుండా వ్యూహాత్మకంగా ముందస్తునకు బీజేపీ పావులు కదుపుతుంది అన్న చర్చ అయితే జాతీయ స్థాయిలో ఉంది. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికల తరువాత అక్టోబర్ లో ముందస్తు నగరా మోగినా మోగుతుంది. ఏడాదిన్నర కాలం అధికారాన్ని వదిలేసుకుని మరీ బీజేపీ మరోమారు కేంద్రంలో అధికారం కోసం కాసే రాజకీయ పందెం అది అంటున్నారు.

ఆ విధంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలూ కూడా ముందస్తునకు సిద్ధంగా ఉన్నాయా అన్న చర్చ ఉంది. తెలంగాణా తీసుకుంటే కేసీయార్ ఒకసారి ముందస్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఇపుడు కేంద్రం ముందస్తు అంటే ఆయన జోడీ కట్టేది లేదనే అంటారు. ఆ జాతీయ పార్టీ ప్రభావం శాసనసభ ఎన్నికల మీద పడుతుంది అని కూడా ఆలోచిస్తారు. అయినా కూడా ఎంపీ ఎన్నికలు ఉంటాయి. అక్కడ కనుక రివర్స్ అయితే 2023లో జరిగిఏ అసెంబ్లీ మీద కూడా పెను ప్రభావమే పడుతుంది. సో గులాబీదళం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా బీజేపీ వ్యూహాలు మరింతగా పదును తేరే ఉంటాయని అంటున్నారు.

ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ సర్కార్ ముందస్తు కి సై అనే అంటుంది అన్న మాట ఉంది. అయితే వచ్చే ఏడాది దాకా ప్రభుత్వాన్ని నడిపి ఏడాది ముందర ముందస్తు అంటే వైసీపీ ఓకే అన్న మాట ఉంది. ఇప్పటికైతే వైసీపీ సర్కార్ ఎక్కడా సర్దుకోలేదు. వరసగా మూడు దశలుగా కరోనా వచ్చి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో ఇదే ఏడాది ముందస్తు అంటూ కేంద్రంలోని బీజేపీ షాక్ ఇస్తే కనుక వైసీపీ ప్రిపేర్ గా ఉందా అన్నదే చర్చ.

పైగా ఏపీలో సమస్యలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇపుడు ఉద్యోగులు కూడా ఆందోళన బాటన పయనిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముందస్తు అంటే వైసీపీకి రాజకీయంగా ఇబ్బందే అన్న మాట ఉంది. కేంద్రంలో ఉన్నది బీజేపీ, అక్కడ వ్యూహాలు వేరుగా ఉంటాయి, షార్ప్ గా ఉంటాయి. వారికి రాజకీయ ప్రయోజనం అనిపిస్తే ముందస్తుకు సై అనేస్తారు. మరి రెండేళ్ల వరకూ టైమ్ ఉంది అనుకుని వైసీపీ ధీమా చేసినా వివిధ వర్గాలతో గిల్లికజ్జాలు పెట్టుకుని కోరి మరీ నెగిటివిటీ తెచ్చుకుంటే మొత్తానికే మోసం అవుతుంది అన్న మాట పార్టీ లోపలా బయటా వినిపిస్తోంది. మరి సర్దుకోకపోతే మాత్రం ఇంతే సంగతులు అంటున్నారు.