Begin typing your search above and press return to search.

రాత్రివేళ అడ్వొకేట్ జనరల్ ప్రెస్ మీట్..నిమిషాల్లో మారిన సీన్!

By:  Tupaki Desk   |   31 May 2020 6:17 AM GMT
రాత్రివేళ అడ్వొకేట్ జనరల్ ప్రెస్ మీట్..నిమిషాల్లో మారిన సీన్!
X
ఏపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రివేళ.. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఏజీ ఎస్. శ్రీరాం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న రచ్చలో కొత్త ఆట షురూ అయ్యింది. ప్రెస్ మీట్ పూర్తి అయిన నిమిషాల వ్యవధిలోనే సీన్ మారిపోవటమే కాదు.. కొత్త పరిణామాలకు తెర తీసింది. ఇంతకూ ఏం జరిగిందంటే?

ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తొలగించటం.. ఆయనపై తీవ్ర ఆరోపణలు.. విమర్శలు చేయటం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించటం.. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా తనను తాను ప్రకటించుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. దీనికి తగ్గట్లే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ ఛార్జి కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ ఒక ఆర్డర్ అందరికి పంపారు. నిమ్మగడ్డ మళ్లీ ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు అందులో పేర్కొన్నారు.

అంతేకాదు.. అప్పటివరకూ ఎస్ఈసీగా వ్యవహరిస్తున్న జస్టిస్ కనగరాజ్ ను తప్పించినట్లైంది. రమేశ్ కుమార్ ప్లేస్ లో ఏపీ సర్కారు జస్టిస్ కనగరాజ్ ను నియమించటం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన సర్య్కులర్ రమేశ్ కుమార్ పుణ్యమా అని రద్దు అయ్యింది. ఇదిలా ఉంటే.. అసాధారణంగా శనివారం రాత్రి అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. పంచాయితీ రాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉన్నారు. వారి సమక్షంలో శ్రీరాం కీలక ప్రకటన చేశారు.

నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ కుదరదని తేల్చటంతో పాటు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అంటే.. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకాన్ని గుర్తించటంలేదన్న విషయాన్ని తేల్చినట్లైంది. ఈ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే.. ఏపీ ఎన్నికల కమిషన్ నుంచి కీలక సర్క్యులర్ ఒకటి విడుదలైంది. అందులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ ఈసీగా మళ్లీ బాధ్యతలు చేపట్టినట్లు జారీ చేసిన సర్క్యులర్ ను ఉపసంహరించినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. నిమ్మగడ్డ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లైంది. ఎత్తుకు పైఎత్తు అన్న రీతిలో నడుస్తున్న ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.