Begin typing your search above and press return to search.

తెలుగు వారి ఆత్మీయ ఆంధ్రాబ్యాంక్ క‌నుమ‌రుగు

By:  Tupaki Desk   |   1 April 2020 2:30 PM GMT
తెలుగు వారి ఆత్మీయ ఆంధ్రాబ్యాంక్ క‌నుమ‌రుగు
X
తెలుగు వారి మ‌న‌సెరిగిన‌.. సంప్ర‌దాయ బ్యాంక్‌గా ఉన్న ఆంధ్రాబ్యాంకు క‌నుమ‌రుగైంది. ద‌శాబ్దాల పాటు విశేష సేవ‌లు అందించిన ఆంధ్రాబ్యాంక్ ప్ర‌స్థానం ముగిసింది. సుల‌భ‌మైన ప‌ద్ధ‌తులు.. స‌ర‌ళ‌మైన విధానాల‌తో అంద‌రి మ‌న‌సులు పొందిన తెలుగువారికి ఉన్న ఒకే ఒక్క బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్‌ ను కోల్పోయాం. ఆ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ లో విలీనం కావ‌డంతో మార్చి 31వ తేదీతో ఆంధ్రాబ్యాంక్ క‌నుమ‌రుగైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ లో విలీన‌మైంది. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద జాతీయ బ్యాంక్‌ గా అవతరించింది.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)తోపాటు ఆంధ్రాబ్యాంక్‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ) విలీన‌మైంది. దీంతో కొత్త శ‌క్తితో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ అవ‌త‌రించింది. పీఎన్‌ బీ ఇప్పుడు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌ బీఐ) తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. వ్యాపారపరంగా రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించిన పీఎన్‌ బీ తన తదుపరి విస్తరణ అవకాశాలపై దృష్టి పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీ నేపథ్యంలో జాతీయ బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో భావితరం బ్యాంకుగా పీఎన్‌ బీ నిలవనుంది.

ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ ప్ర‌ధాన బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. ఇన్నాళ్ల పాటు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్‌ బీ శాఖ‌లుగా పని చేస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బీఐ) నోటిఫికేషన్ ప్రకారం - పంజాబ్ నేషనల్ బ్యాంక్ - యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) విలీనం బుధవారం (ఏప్రిల్ 1) అమలులోకి వచ్చింది. దేశం - వ్యాపారం - బ్రాంచ్ నెట్‌ వర్క్ పరంగా తాజా విలీనం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుందని వ్యాపార వ‌ర్గాలు - ఖాతా దారులు భావిస్తున్నారు.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) శాఖలుగా పని చేస్తాయి. ఇప్పుడు డిపాజిటర్లతో సహా వినియోగదారులందరినీ పీఎన్‌బీ వినియోగదారులుగా పరిగణిస్తారు. విలీనం చేసిన బ్యాంకు 11,000 పైగా శాఖలు - 13,000 ఏటీఎంలు - లక్ష మంది ఉద్యోగులు - 18 లక్షల కోట్ల రూపాయల వ్యాపార మిశ్రమాల ద్వారా విస్తృత భౌగోళిక పరిధిని కలిగి ఉంటుంది.

ప్రారంభ దశలోనే - పీఎన్‌ బీ శాఖలన్నీ మొబైల్ - ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ తో సహా అన్ని ప్లాట్‌ ఫారమ్‌ ల ద్వారా పేర్కొన్న ఇంటర్ ఆపరేబుల్ సేవలను పీఎన్‌ బీ అందించనుంది. ఈ విలీనం చారిత్రాత్మక క్షణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ - సీఈఓ సీహెచ్ ఎస్ ఎస్ మల్లికార్జునరావు అభివ‌ర్ణించారు. ఇక‌పై అత్యాధునిక సేవలను అందించే ఆధునిక నూతన తరం బ్యాంక్ అవుతుందని తెలిపారు. వినియోగదారులకు మరింత సమర్థవంతంగా సేవ చేయడంలో సహాయపడుతుందని వెల్ల‌డించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 ఏప్రిల్ 12వ తేదీన లాహోర్‌ లో ప్రారంభ‌మైంది. రూ.2 లక్షల అధీకృత మూలధనం - రూ.20,000 మూలధనంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఇప్పుడు ఆ బ్యాంక్‌ ల విలీనంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ గా అవ‌త‌రించ‌డం విశేషం. ఈ బ్యాంక్ జాతీయవాద స్ఫూర్తితో ఏర్పాటైన భారతీయ మూలధనంతో భారతీయులు పూర్తిగా నిర్వహించే మొదటి బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఈ బ్యాంక్‌ లో ఇప్ప‌టివ‌ర‌కు 7 బ్యాంకులు విలీనం కావ‌డం విశేషం.