Begin typing your search above and press return to search.

జేసీ బ్ర‌ద‌ర్స్ భ‌య‌ప‌డుతున్నారా..?

By:  Tupaki Desk   |   24 Oct 2021 4:30 PM GMT
జేసీ బ్ర‌ద‌ర్స్ భ‌య‌ప‌డుతున్నారా..?
X
అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్.. ఇంకా వైసీపీ ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డుతున్నారా? ఇప్ప‌టికీ .. అభ‌ద్ర‌తా భావంతోనే ఉన్నారా? ఇదీ.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. తాజాగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన నిర‌స‌న దీక్ష‌కు అనంత‌పురం జిల్లా మొత్తం క‌దిలి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమితమైన నాయ‌కులు కూడా త‌ర‌లి వ‌చ్చి.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తాము స్పందించ‌క‌పోతే.. పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. కేడ‌ర్‌లోనూ బ‌ల‌హీన‌త ఏర్ప‌డుతుంద‌ని వారు భావించి ఉంటారు. అందుకే వారు వీరు అనే తేడా లేకుండా.. ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు క‌ద‌లారు. చంద్ర‌బాబుకు సంఘీభావం ప్ర‌క‌టించారు.

మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, ఉన్నం హనుమంతురాయచౌదరి, జితేంద్రగౌడ్‌, నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, వెంకటశివుడు యాదవ్‌, ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, కంబదూరు రామ్మోహన చౌదరి, దేవళ్ల మురళి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే.. ఇంత మంది వ‌చ్చినా.. అత్యంత కీల‌క‌మైన జేసీ ప్ర‌భాక‌ర్‌కానీ, జేసీ దివాక‌ర్ కానీ.. రియాక్ట్ కాలేదు. క‌నీసం ఒక ప్ర‌క‌ట‌న కూడా జారీ చేయ‌లేదు.

ఇక‌, వ‌చ్చిన నాయ‌కులు కూడా చేతులు ముడుచుకుని.. కూర్చోలేదు. వైసీపీపై తాడో పేడో తేల్చుకుంటామ‌ని.. త‌మ‌దీ సీమ ర‌క్త‌మేన‌ని.. త‌మ‌కు కూడా పౌరుషం ఉంద‌ని.. ప‌రిటాల సునీత నిప్పులు చెరిగారు. మ‌రి ఇలా మ‌హిళా నాయ‌కులే ముందుండి.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక్క‌డ ఇంకో విష‌యం చ‌ర్చించుకోవాలి. ఒక్క జేసీ వ‌ర్గంపైనే పోలీసులు కేసులు న‌మోదు చేయ‌లేదు. ప్ర‌భుత్వం కేసులు పెట్టించ‌లేదు. ప‌రిటాల శ్రీరాం స‌హా.. సునీత‌పైనా.. ఇటీవ‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ఇక‌, ఇత‌ర నేత‌లపైనా కేసులు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. వారు దూకుడుగానే వ‌చ్చారు. కానీ, జేసీ వ‌ర్గంలో ఒక్క‌రంటే.. ఒక్క‌రుకూడా ముందుకు రాలేదు. దీనిని బ‌ట్టి రాజ‌కీయ వ‌ర్గాల్లో అనేక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ప్ర‌ధానంగా జేసీ బ్ర‌ద‌ర్స్ ప్ర‌భుత్వానికి ఇంకా భ‌య‌ప‌డుతున్నారా? త‌మ‌పై ఉన్న కేసుల‌కు ఇంకా జ‌డుస్తున్నారా? లేక‌.. తాడిప‌త్రి మునిసిపాలిటీ త‌మ‌కు ద‌క్కేలా చ‌క్రం తిప్పార‌ని అంటున్నా వైసీపీ అధిష్టానం విష‌యంలో కృత జ్ఞ‌త చూపించుకుంటున్నారా? లేక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు వైసీపీ త‌ర‌ఫున జెండా ఎగ‌రేస్తారా? ఇలా.. అనేక విష‌యాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అంతేకాదు.. పోనీ.. వ‌యో స‌మ‌స్య‌ల‌తో ఇద్ద‌రు నేత‌లు రాక‌పోయినా.. యువ నాయ‌కులు.. జేసీ వార‌సులు ప‌వ‌న్ కుమార్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల‌నైనా పంపించి ఉండాలి క‌దా! అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. దీనిపై స్పందించేందుకు జేసీ వ‌ర్గంలో ఎవ‌రూ ముందుకు రాలేదు. సో.. దీనిని బ‌ట్టి.. జేసీ వ‌ర్గం ఆలోచ‌న వేరేగా ఉంద‌ని.. అంటున్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి.