Begin typing your search above and press return to search.

అమిత్‌ షా ప‌బ్లిక్‌ గా బుక్క‌య్యారు

By:  Tupaki Desk   |   15 Aug 2018 11:36 AM GMT
అమిత్‌ షా ప‌బ్లిక్‌ గా బుక్క‌య్యారు
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనూహ్య రీతిలో నెటిజ‌న్ల‌కు - వీక్ష‌కుల‌కు అస్త్రం అందించారు. ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టే నేత‌గా పేరున్న అమిత్ షా 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనుకోని రీతిలో విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చోటిచ్చారు. ఇంత‌కీ ఏం జరిగిదంటే..పార్టీ జాతీయ‌ ఆఫీసులో పతాకావిష్కరణ చేసే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతీయ జెండాను ఎగరవేస్తున్నప్పుడు పొరపాటున జెండా నేలకు తాకింది. అంతలోనే తేరుకున్న అమిత్‌షా మళ్లీ తన పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, అమిత్ షా తప్పిదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కింది. దీంతో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

జెండా వంద‌నం సంద‌ర్భంగా త‌లెత్తిన పొర‌పాటును అమిత్ షా స‌రిదిద్దుకున్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ పార్టీ దీన్ని అవ‌కాశంగా తీసుకొని విమర్శలు గుప్పించింది. అమిత్ షా ఇబ్బందులు ప‌డ్డ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను తన అఫీషియల్ ట్విటర్‌ అకౌంట్ పోస్ట్ చేసింది. ``జాతీయ పతాకాన్ని సరిగ్గా ఆవిష్కరించలేని వారు దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు? మనసు నిండా దేశభక్తి ఉందని చెప్పుకునే వారికి జాతీయ గీతాన్ని ఎలా ఆలపించాలో తెలీయదు`` అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

అయితే ఈ ప‌రిణామంపై బీజేపీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేసేందుకు అవ‌కాశాలు వెతుక్కుంటోంద‌ని ఎద్దేవా చేసింది. ఇలాంటి పొరపాట్లు జరగడం.. విమర్శలు వెల్లువెత్తడం ఇదే తొలిసారి కాదని, 2016లో ఆగస్టు 15న సందర్భంగా జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జెండావిష్కరణ కార్యక్రమంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుందని ఆ పార్టీ వివ‌ర‌ణ ఇచ్చింది. జాతీయ జెండా కింద పడిపోతుండడంతో ఆమె చేతుల్తో పట్టుకున్నారని గుర్తు చేసింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ త‌న‌ బిజూ జనతా దళ్‌ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తుండగా జాతీయ జెండా నేలను తాకింది. అనంత‌రం ముఖ్య‌మంత్రి సరిగా ఎగుర‌వేశార‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.