Begin typing your search above and press return to search.

ఈసీ షాక్ తో అమిత్ షా.. కేసీఆర్ బహిరంగ సభలు బంద్!

By:  Tupaki Desk   |   22 Oct 2021 4:35 AM GMT
ఈసీ షాక్ తో అమిత్ షా.. కేసీఆర్ బహిరంగ సభలు బంద్!
X
దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉప ఎన్నికలకు సంబంధించి తమకు అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గంలోనూ.. ఆ జిల్లాలోనూ ఎన్నిక కోడ్ అమల్లో ఉండటం తెలిసిందే. దీంతో.. తమ కార్యకలాపాలను పక్క జిల్లాల నుంచి నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల తీరుతో వాటికి బ్రేకులు వేసేలా కొత్త తరహా నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికలు జరిగే జిల్లాలో మాత్రమే కాదు.. పక్కనున్న జిల్లాల్లోనూ కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంతో తెలంగాణ లోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభలు రద్దు అయినట్లేనని చెబుతున్నారు. భారీ సభల ద్వారా తమ సందేశాన్ని ఇవ్వొచ్చని ఆశపడిన అగ్రనేతలకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్పాలి.
దీంతో.. ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలువురు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వారి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఎన్నికలు జరిగే పొరుగు జిల్లాల్లో సభలు.. సమావేశాల్ని కూడా నిర్వహించకూడదన్న షాకింగ్ నిర్ణయంతో.. కొత్త తరహా ప్లానింగ్ కోసం పార్టీలు వెతుకులాటలు మొదలు పెట్టాయి. ఇదిలా ఉంటే.. తాజాగా వచ్చిన ఈసీ ఆదేశాల నేపథ్యంలో సరికొత్త వ్యూహానికి తెర తీసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

గులాబీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 26.. 27 తేదీల్లో రెండురోజుల పాటు సీఎం కేసీఆర్.. హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు. దీనిపై సీరియస్ గా సమాలోచనలు చేస్తున్నారు. ఈసీ తాజా నిర్ణయంతో.. రోడ్ షోల్లో పాల్గొనటానికి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అధికార.. విపక్ష పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారి.. నువ్వా.. నేనా? అన్న రీతిలో సాగుతున్న ఉప ఎన్నికల్లో విజయం కోసం ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్లాన్ బి వివరాలు బయటకు రాగా.. బీజేపీ ఏం చేయనుందన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.