Begin typing your search above and press return to search.

విగతజీవిగా అమీన్‌పూర్ ఆనంద్ .. ఐదు రోజుల తర్వాత కారుతో సహా వాగులో .. !

By:  Tupaki Desk   |   19 Oct 2020 9:30 AM GMT
విగతజీవిగా అమీన్‌పూర్ ఆనంద్ .. ఐదు రోజుల తర్వాత కారుతో సహా వాగులో .. !
X
సంగారెడ్డి జిల్లాలో ఐదు రోజుల క్రితం వరద నీటిలో కారుతో సహా కొట్టుకుపోయిన ఆనంద్ మరణించాడు. వరద నీటిలో కొట్టుకుపోయిన కారును ఆదివారం నాడు కాజ్ వే వరద నీటి నుంచి సిబ్బంది బయటికి తీశారు. అందులో ఆనంద్ మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ నెల 13వ తేదీన అమీన్‌ పూర్ కాజ్ వే మీదుగా ఇంటికి వెళ్తున్న ఆనంద్ వరద తాకిడిలో చిక్కుకుపోయారు. కారుతో పాటు కొట్టుకుపోయాడు.

ఈ విషయాన్ని ఆయన తన సోదరుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అంతేకాకుండా తాను ఉన్న ప్రాంతాన్ని ఫోన్ ద్వారా లోకేషన్‌ ను సైతం షేర్ చేశాడు. ఈ నెల 14వ తేదీ నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఆనంద్ కోసం జీహెచ్ ఎం సీ, ఎన్డీఆర్ ఎఫ్, రెవెన్యూ బృందాలు విడివిడిగా గాలింపు చర్యలు చేపట్టాయి. చివరికి ఆయన కారు అమీన్ ‌పూర్ ఇసుకబావి మురుగు కాలువలో ఉండిపోయినట్లు గుర్తించారు. ఆ కారును రెస్క్యూ బృందం ఆదివారం క్రేన్లతో బయటికి తీసింది. ఆ కారులోనే ఆనంద్ మృతదేహం ఉంది.ఈ నెల 16వ తేదీన ఆనంద్ కుమార్తె పుట్టిన రోజు. అంతేకాక, అతని భార్య ఐదు నెలల గర్భిణి. ఆనంద్ ఆచూకీ కోసం ఐదు రోజులుగా కాజ్ వే వద్దే అతని కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. చివరికి ఆనంద్ విగతజీవిగా మిగలడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు. మృతుదేహంతో పాటు కారును వాగులో దిగి వెలికితీసేందుకు కాకినాడ నుంచి ఓ బృందం ప్రత్యేకంగా వచ్చింది. వరదలకు కొట్టుకుపోయిన కారు వాగులో 2 వందల మీటర్ల లోతుకు వెళ్లడంతో గుర్తించడం కష్టంగా మారింది.

ఆనంద్ భౌతికకాయానికి వాగు పరిసరాల్లోనే అధికారులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. గత కొన్ని రోజులుగా ఆనంద్‌ కోసం ఎదురుచూసిన ఆ కుటుంబీకులు ఆయన విగతజీవిగా ఉండటం చూసి విలపించారు. ఆనంద్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలు సహాయ సహాకారలు అందజేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.