Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మార్చి నుంచి కొత్త పథకం!

By:  Tupaki Desk   |   27 Jan 2023 8:02 PM GMT
జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మార్చి నుంచి కొత్త పథకం!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వైద్యరంగంలో ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మార్చి 1 నుంచి మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, 108, 104 (సంచార వైద్య శాలలు) వంటి పథకాలను జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో మార్చి 1 నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ను అమలు చేయాలని నిర్ణయించింది.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ లో భాగంగా ప్రతి గ్రామంలో క్లినిక్‌కు నెలలో రెండుసార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారు. జనాభా నాలుగు వేలు దాటి ఉంటే మూడోసారి కూడా వెళ్తారు. గ్రామీణ ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించి.. గ్రామాల్లోనే చికిత్స పొందే అవకాశం లభిస్తుంది.

ఈ మేరకు తాజాగా వైద్య శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. మార్చి 1 నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని ఆదేశించారు. అదేవిధంగా మార్చి 1 నుంచే.. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఆయనకు వివరించారు.

కాగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అలాగే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి మొదలవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే రోగుల నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టవచ్చని భావిస్తోంది. అదేవిధంగా మార్చి 1 నుంచే జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్‌ అందించనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.