Begin typing your search above and press return to search.

నిద్ర లేస్తే ట్రోల్ చేసే వైసీపీ ఆర్మీకి కొత్త సవాలుగా మారిన జగన్!

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:25 AM GMT
నిద్ర లేస్తే ట్రోల్ చేసే వైసీపీ ఆర్మీకి  కొత్త సవాలుగా మారిన జగన్!
X
అందుకే అంటారు ఒకడి వైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయని. అందుకే వేలెత్తి చూపించటానికి ముందు.. మనకు మనం ఎలా ఉన్నామన్న విషయం మీద కాసింత ఆలోచన చేస్తే.. సగం చిక్కులు తప్పుతాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని.. ఆయన పార్టీకి చెందిన సోషల్ మీడియా ఆర్మీకి కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే మాటల్ని శోధించి.. శోధించి మరీ గుర్తించి.. మస్తు ఎటకారం ఆడేయటంతో పాటు.. తెగ ట్రోల్ చేసేసే వైనం తెలిసిందే.

ఇంతలా విరుచుకుపడినప్పుడు ప్రత్యర్థులకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అస్సులు అవకాశం ఇవ్వకూడదు కదా? కానీ.. ఆయన తన ప్రసంగం చేసే వేళలో.. పలు మాటల్ని స్పష్టంగా పలికే విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో ఆయన నోటి నుంచి వచ్చే చిన్న మాటలు సైతం.. వినలేనంత ఇబ్బందిని కలిగిస్తున్న పరిస్థితి. పంద్రాగస్టు సందర్భంగా జెండా వందనం చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి 45 నిమిషాల పాటు ప్రసంగించారు.

ఇందులో భాగంగా ఆయన ప్రసంగంలో కొన్ని పదాల్ని ఆయన అతి కష్టంగా పలకటం ఒక ఎత్తు అయితే.. ఆయన మాటలోని తేడా పుణ్యమా అని.. పలు పదాల్నిస్పష్టంగా పలకలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. తాజా ప్రసంగంలో ఆయన బోలెడన్నిసార్లు పదాల్ని పలికే విషయంలో ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని పదాల్ని తప్పుగా ఉచ్ఛరించటం.. మరికొన్ని పదాల్ని స్పష్టంగా పలకలేకపోవటం.. మొత్తంగా మాట్లాడేటప్పుడు తీవ్ర ఇబ్బందికి గురైనట్లుగా చెప్పాలి.

మరి ముఖ్యంగా.. సేద్యానికి బదులుగా 'స్వేద్యం'.. ఆర్థిక స్వాలంబన.. అభ్యుద్వయం.. ఉటకించారు.. సమాజిక అభద్రత.. మహానుయోధులు.. వజ్జోత్సవాలు.. ఇలా పలు పదాల్ని ఆయన సరిగా పలకలేక.. తప్పుగా పలకటంతో సీఎం జగన్ స్పీచ్ వినేవారు తెగ ఇబ్బందులకు గురయ్యారు. పలు పదాల్ని సరిగా పలకలేని ఆయన.. మొత్తం ప్రసంగంలో ఇరవైకి పైగా పదాలు పలికే విషయంలో తప్పులు దొర్లితే.. మరికొన్ని పదాల్ని చదవటంలో ఆయన తడబాటుకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు. అంటే.. జగన్ కు భాష మీద పట్టులేకపోవటంతో పాటు.. రెగ్యులర్ గా తెలుగులో మాట్లాడే అవకాశం లేకపోవటమే అంటున్నారు.

ఇలాంటి కీలక సందర్భాల్లో తాను మాట్లాడాల్సిన స్పీచ్ ను ఒక రోజు ముందే తెప్పించుకొని.. కాసింత సేపు దాని మీద ఫోకస్ పెట్టి.. రెండూ.. మూడు సార్లు చదువుకుంటే అయిపోయే దానికి.. కోట్లాది మంది ముందు పలుచన అయ్యేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యవహరిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ తీరును ఆయన వీలైనంత త్వరగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జగన్ స్పీచ్ లో దొర్లిన తప్పుల్ని చూస్తే..

- మహాయోధుల త్యాగాలతో అనటానికి బదులుగా మహానుయోధుల త్యాగాలతో అని అన్నారు.

- స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు బదులుగా స్వాతంత్య్ర వజ్జోత్సవాలు.

- ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం అనటానికి బదులుగా ఆర్థిక స్వాలంబనకు చేయూత ఇస్తున్నాం.

- సుస్థిరాభివ్రద్ధి లక్ష్యాలకు బదులుగా సుస్థిరాభివ్రద్ధి లక్షణాలుగా అన్నారు.

- ఉటంకించారు అనటానికి బదులుగా ఉటకించారు అన్నారు.

- స్వేదం బదులుగా స్వేద్వం అన్నారు.

- విప్లవాత్మక అనే దానికి బదులుగా విప్లవాత్మిక గా పలికారు.

- అభ్యుదయాన్ని 'అభ్యుద్వయం'గా పలికారు.

- నియామకం అనాల్సిందే అందుకు బదులుగా నియాకం అనేశారు. తర్వాత సర్దుకొని నియామకంగా చదివారు.

- ప్రతి పథకం అనటానికి బదులుగా ప్రతి ప్రతకం అని.. ధర్మాల సమ్మేళనం అనటానికి ధర్మేలా సమ్మేళన అని పలకటం గమనార్హం.