Begin typing your search above and press return to search.

అమ్మ జయలలితపై ప్రేమతో ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   12 Sep 2019 11:09 AM GMT
అమ్మ జయలలితపై ప్రేమతో ఏం చేశాడంటే?
X
జయలలిత చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఇంకా ఆమెపై తమిళ ప్రజలకు ఉన్న పిచ్చి అభిమానం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆమె పార్టీ అన్నాడీఎంకే నేతలకు జయం అభిమానం కొండంతలు ఉందనడానికి సజీవ సాక్ష్యమే ఈ ఘటన..

సాధారణంగా పెళ్లి చోట చావు బాజాలు అన్నా..చావుకు సంబంధించిన ఏ వ్యవహారాన్ని అయినా తీసుకురావడానికి అందరూ ఒప్పుకోరు. శుభకార్యానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే జయలలితపై పిచ్చి అభిమానంతో ఓ అన్నాడీఎంకే నేత ఎస్ భవానీ శంకర్ తన కుమారుడి పెళ్లిని ఏకంగా చెన్నై బీచ్ లోని అమ్మ జయలలిత సమాధి వద్దే చేయడం సంచలనంగా మారింది.

అన్నాడీఎంకే నేత భవానీ శంకర్ తాజాగా జయలలితపై ప్రేమతో చెన్నై బీచ్ లోని ఆమె సమాధిని అందంగా పూలతో అలంకరించి అమ్మ ఫొటోపెట్టి ఆమె సమాధి వద్దే తనకుమారుడు పెళ్లి జరిపించడం విశేషం. ఎందరు సమాధి వద్ద పెళ్లిళ్లు చేయవద్దని వారించినా భవానీ శంకర్ మాత్రం అమ్మను మించిన దైవం లేదని ఇలా సాంప్రదాయబద్దంగా వేద మంత్రాలతో జయలలిత సమాధి వద్ద కుమారుడి వివాహం జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తల్లో జయలలితపై అభిమానం, ప్రేమ తగ్గలేదని తేటెతెల్లమైంది. జయలలిత ఆశీర్వాదం తన కొడుకు, కోడలుపై ఉండాలన్న ఉద్దేశంతోనే ఆమె సమాధి వద్దే పెళ్లి చేశానని భవానీ శంకర్ గర్వంగా చెప్పడం విశేషం. ఇప్పటికే భవానీ శంకర్ జయలలితకు ఓ గుడిని కూడా కట్టడం గమనార్హం.