Begin typing your search above and press return to search.

యశస్వి విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్

By:  Tupaki Desk   |   12 May 2023 3:34 PM IST
యశస్వి విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్
X
ఐపీఎల్ లో మరో సంచలనం నమోదైంది. ఎప్పుడూ చూడని విధ్వంసం చోటుచేసుకుంది. తొలి ఓవర్ తొలి బంతితోనే విరుచుకుపడి ఫోర్లు, సిక్సర్లు కొట్టిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీ20కి అసలు సిసలు ఆటగాడిగా యశస్వి జైస్వాల్ అవతరించాడు. ఐపీఎల్ చరిత్ర లోనే ఒక అరుదైన సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ పై 62 బంతుల్లోనే 124 పరుగులు చేసి సెంచరీ కొట్టిన యశస్వి తాజాగా తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్స్ లతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరవిహార మైన బ్యాటింగ్ కు కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్థాన్ 150 పరుగుల కు పైగా లక్ష్యాన్ని అలవోకగా చేధించేసింది.

విశేషం ఏంటంటే కేవలం 13 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడంటే యశస్వి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డ్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 50 పరుగులుగా ఉండేది. ఆ తర్వాత కమిన్స్ కూడా 14 బంతుల్లో ఆఫ్ సెంచరీని 2022 సీజన్ లో కొట్టాడు.

150 పరుగులకు కోల్ కతా తొలి ఇన్నింగ్స్ ముగియగా.. అనంతరం ఈ విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్.. తొలి ఓవర్ ను కోల్ కతా కెప్టెన్ నితీష్ రానా వేశాడు. ఆ మొదటి ఓవర్ లో యశస్వి రెచ్చిపోయాడు. ఏకంగా వరుసగా 6,6,4,4,2,4 బాది 26 పరుగులు రాబట్టాడు. తర్వాత హర్షత్ రాణా వేసిన రెండో ఓవర్ లో ఆడి మూడు బంతుల్లో 1, 4, 6 పరుగులు చేశాడు. శార్ధుల్ వేసిన మూడో ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. తర్వాత బంతికి సింగిల్ తీసి ఐపీఎల్ చరిత్రలోనే వేగవంత మైన అర్థశతకాన్ని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శాంసన్ సైతం 29 బంతుల్లో 48 పరుగులతో దంచి కొట్టాడు. దీంతో రాజస్తాన్ కేవలం 13.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసింది. ప్లే ఆఫ్ అవకాశాల ను సజీవంగా ఉంచుకుంది.