Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో మగ వ్యభిచారులకు వల ... కోట్లు కాజేశారు, ఎవరంటే !
By: Tupaki Desk | 21 Nov 2020 11:10 AM GMTసైబర్ క్రైమ్ ... అసలు అంతం లేని క్రైమ్ గా ఇది కొనసాగుతుంది. సైబర్ క్రైమ్ ను పూర్తిగా నాశనం చేయాలనే దిశగా ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా నేరస్తులు రోజుకో కొత్త ఆలోచన లో అమాయకులని బురిడి కొట్టిస్తున్నారు. అసలు వారు మాట్లాడేది వింటే ఎవరైనా కూడా ఫ్లాట్ అవ్వాల్సిందే , అంతలా మాటలతో మాయ చేసి , కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మగ వ్యభిచారులు ముఠా గుట్టు బయటపడింది. మగ వ్యభిచారులు కావాలంటూ ప్రకటన ఇచ్చి , ఎవరైనా కాల్ చేస్తే అమ్మాయిలతో మాట్లాడించి , లక్షల్లో కాజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కి చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగుచూసింది.
ఈ వ్యవహారం లో పూర్తి వివరాల్లోకి వెళ్తే .... మేల్ ఎస్కార్ట్ ఉద్యోగాలు కల్పిస్తామనే ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చూడగానే ఓ నిరుద్యోగి స్పైసీఫ్రెండ్ షిప్.కామ్ అనే వెబ్ సైట్ కు లాగిన్ అయ్యాడు. మహిళలు ఫోన్ చేసి వీఐపీ మెంబర్ షిప్, జీఎస్ టీ, బీమా తదితర ఫీ పేరుతొ రూ.13.82లక్షలు స్వాహా చేశారు. ఆ తర్వాత మళ్లీ బ్యాంకు క్లియరెన్స్ కోసం మరో రూ.1.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మోసపోయినట్లు గ్రహించి సెప్టెంబర్ 18న సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే , షాద్ నగర్ కు చెందిన మరో బాధితుడు ఇలాగే మోసపోయాడు. దీంతో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు. ఫోన్ సిగ్నల్స్, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నేపాల్ సరిహద్దులకు సమీపంలోని పశ్చిమ బంగలోని సిలిగురి పట్టణం కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత , అక్కడ మూడ్రోజులు రెక్కీ నిర్వహించి కాల్ సెంటర్లపై దాడులు చేసి బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్ నూర్ ఆలం అన్సారీని అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. టెలికాలర్స్ దీపా హాల్దార్, శిఖా హాల్దార్కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ప్రధాన సూత్రధారులు సంతూదాస్, అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ, సుషాంక్ కుమార్ షా పరారీలో ఉన్నారు. అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ, సుషాంక్ కుమార్ షా స్పైసీఫ్రెండ్ షిప్.కామ్, దిడేటర్స్ హబ్ తదితరాల పేర్లతో కొన్ని వెబ్సైట్లను రూపొందించారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య భవనాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో కాల్సెంటర్ కు బిజయ్, బినోద్ మాదిరిగా ఇద్దరు సూపర్వైజర్లు, మహ్మద్ నూర్ ఆలం అన్సారీని మేనేజర్ గా, పది మంది మహిళలను టెలీకాలర్స్ను నియమించారు.