Begin typing your search above and press return to search.

స్కూల్ విద్యార్థుల అకౌంట్లో 900 కోట్ల రూపాయలు.. ఎలా వచ్చాయి?

By:  Tupaki Desk   |   16 Sep 2021 9:30 AM GMT
స్కూల్ విద్యార్థుల అకౌంట్లో 900 కోట్ల రూపాయలు.. ఎలా వచ్చాయి?
X
స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల డబ్బులు. వందో వెయ్యి చూస్తే చాలా గొప్పగా ఫీలయ్యే విద్యార్థుల అకౌంట్లోకి కోట్ల డబ్బులు ఎలా వచ్చాయో పాపం.. వారికి తెలియదట. అయితే బ్యాంక్ అధికారులు ఒక్కోసారి చేసే పొరపాట్ల కారణంగా ఇలా జరుగుతోంది. ఒక్కోసారి కోట్ల రూపాయలు కూడా ఈ రకంగా వేరే వారి ఖాతాలోకి వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అలా ఖాతాలో పడిన డబ్బు.. మళ్లీ గంటల వ్యవధిలోనే మాయమవుతుంది. పొరపాటు గ్రహించి బ్యాంక్ అధికారులు వెంటనే ఆ డబ్బును సంబంధిత ఖాతా నుంచి తిరిగి తీసుకుంటుంటారు.

కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులు ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తే ఏం జరుగుతుంది. అలాగే విద్యార్థుల అకౌంట్లో 900 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అసలు విషయం తెలిసిన తర్వాత బ్యాంకు అకౌంట్లో డబ్బులు కోసం వెళ్తే బ్యాంకు అధికారులు ఆపేశారు. ఈ ఘటన ఉత్తర బీహార్ గ్రామీణ ప్రాంతంలో జరిగింది. బీహార్‌లో ఇద్దరు పిల్లల బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు జమ అయింది. అది వారి కుటుంబాలను మాత్రమే కాదు.. మొత్తం గ్రామాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులు అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.

ఈ ఇద్దరూ విద్యార్థులు కటిహార్ జిల్లాలోని బాగౌరా పంచాయితీలోని పస్త్య గ్రామంలో నివసిస్తున్నారు. పాఠశాల యూనిఫామ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం వారి బ్యాంకుల్లో ఇటీవల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసింది. తమ అకౌంట్లో క్రెడిట్ సొమ్ము గురించి తెలుసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్థానిక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)దర్శించారు. కానీ, వారిద్దరి బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల నగదు ఉందని తెలిసి బ్యాంకు అధికారులతో సహా విద్యార్థులు షాక్ అయ్యారని నివేదిక పేర్కొంది. ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. విశ్వాస్ అకౌంట్లో రూ. 60 కోట్లు ఉండగా.. అసిత్ కుమార్ అకౌంట్లో రూ. 900 కోట్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా వారి అకౌంట్లను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే డబ్బు విత్ డ్రా చేయకుండా అకౌంట్ ఫ్రీజ్ చేసేశారు. అలాగే కోట్ల రూపాయల నగదు వారి అకౌంట్లలోకి ఎలా క్రెడిట్ అయిందో విచారణకు ఆదేశించారు. ఉన్నత అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. బ్యాంక్ సీనియర్ అధికారులు కోట్ల నగదు ఎలా క్రెడిట్ అయిందో గుర్తించే పనిలో పడ్డారు. విచారణలో సాంకేతిక లోపం వల్లే భారీనగదు క్రెడిట్ అయినట్టు గుర్తించారు.

రెండు రోజుల క్రితమే ఖగారియా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రైవేట్ టీచర్ అకౌంట్లో రూ. 5.5 లక్షలు జమ అయ్యాయి. తన అకౌంట్లో జమ అయిన వాటిలో 1,60, 970 ఖర్చు చేశాడు. ఆ తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందిగా బ్యాంక్ అతడికి నోటీసులిచ్చింది. అప్పుడు అతడు వినలేదు. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. లాక్ డౌన్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఈ కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారంటూ వాదించాడు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని అందుకే ఆ మొత్తంలో కొంత నగదును ఖర్చు పెట్టేశానని చెప్పుకొచ్చాడు. కష్టాల్లో ఉన్న తనను ప్రభుత్వమే అకౌంట్లో డబ్బు వేసి ఆదుకుందని అన్నాడు. తన అకౌంట్లో డబ్బును తిరిగి ఇచ్చేదిలేదని మొండికేశాడు. చివరికి పోలీసుల ఎంట్రీ ఇచ్చి అతన్ని అరెస్టు చేయగా.. స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.