Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్.. కేంద్రం కఠిన నిర్ణయం

By:  Tupaki Desk   |   7 Jan 2022 5:30 PM GMT
విదేశాల నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్.. కేంద్రం కఠిన నిర్ణయం
X
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధించింది.ముఖ్యంగా ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగానే ఇటలీ నుంచి ఓ చార్టెడ్ విమానం అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అందులోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టుల్లో మొత్తం 125 మంది ప్రయాణికులకు వైరస్ సోకినట్లు తేలింది. వారందరినీ హోటల్ కు తరలించి కేంద్రం క్వారంటైన్ చేసింది.

దేశంలో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదలకు విదేశాల నుంచి వచ్చే ఒమిక్రాన్ బాధితులే కారణమని భావిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులందరికీ ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రావెల్ నిబంధనలను సడలించింది.

ఎట్ రిస్క్ ఉన్న ప్రమాదకర దేశాల జాబితాలో ఉంచబడిన యూకే సహా అన్ని యూరప్ దేశాలు.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బొట్స్ వానా, చైనా, ఘనా , మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే వాళ్లు ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత కోవిడ్ పరీక్ష కోసం శాంపిల్స్ ను ఇవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. వీరి టెస్ట్ ఫలితాలు వచ్చిన తర్వాతనే ఎయిర్ పోర్టు దాటి వెళ్లేందుకు అనుమతిస్తారు.

నెగెటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి.. ఎనిమిదో రోజున ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలను ఎయిర్ సువిధ పోర్టల్ లో ప్రయాణికులు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ ఫలితం వస్తే వారు తదుపరి 7 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. పాజిటివ్ ఫలితం వస్తే కొత్త మార్గదర్శకాల ప్రకారం వారి నమూనాలను ప్రయోగశాలకు పంపి పరీక్షలు చేస్తారు. చికిత్స పొందాకే నయం అయ్యాక విడుదల చేస్తారు.

కరోనా యూరప్, అమెరికా దేశాలను అల్లాడిస్తోంది. తాజాగా బయటపడిన ఒమిక్రాన్ తీవ్రతతో యూరప్ దేశంలో వేల కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఆంక్షలు, నిబందనలు కఠినతరం చేయడంతో భారతీయులు స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చిన ఓ విమానంలో 125 మందికి పైగా పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. తాజాగా మరో విమానం కూడా వచ్చింది. అందులో ఏకంగా 150 మందికి కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది. దీంతో కేంద్రం విదేశాల నుంచి వచ్చే వారికి కఠిన క్వారంటైన్ నిబంధనలు పెట్టింది.