Begin typing your search above and press return to search.

అఖిల భారత కోటా కింద 6,410 MBBS సీట్లు !

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:40 PM GMT
అఖిల భారత కోటా కింద 6,410 MBBS సీట్లు !
X
దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ త్వరలో స్టార్ట్ కాబోతుంది. వారం రోజుల్లోగా నీట్‌ ఫలితాలు వెలువడగానే ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు మొదలుకానున్నాయి. నీట్‌ అర్హత ద్వారానే అడ్మిషన్లు జరుగుతుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లు జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాల విద్యార్థులూ తమ ర్యాంకును బట్టి ఇష్టమైన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశముంది. అందుకోసం ఆప్షన్లు ఉంటాయి.

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 541 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 82,926 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అందులో 278 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 42,729 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇక 263 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 38,840 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ సహా మరో 15 ఎయిమ్స్‌ల్లో 1,367 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఆ ప్రకారం జాతీయంగా 6,410 ఎంబీబీఎస్‌ సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. ఈ మేరకు జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ జరగనుంది.

ఆ ప్రాతిపదికనే నీట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లలో తమకు ఇష్టమైన మెడికల్‌ కాలేజీలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులకు నీట్‌ ర్యాంకు ఆధారంగా కాలేజీలను కేటాయిస్తారు. ఎంసీఐ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని 32 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 5,040 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అందులో 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్‌ సీట్లుండగా, 22 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 3,300 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో 15 శాతం అంటే 261 సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లన్నింటినీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇక బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లున్నా వీటన్నింటినీ జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులు అఖిల భారత స్థాయిలో దాదాపు 8 వేల సీట్లకు పోటీపడే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంచనా వేస్తున్నాయి.