Begin typing your search above and press return to search.

అపర కాళిక ఇందిర.. నాటి ఘటనకు 50 ఏళ్లు పూర్తి!

By:  Tupaki Desk   |   2 Nov 2022 7:10 AM GMT
అపర కాళిక ఇందిర.. నాటి ఘటనకు 50 ఏళ్లు పూర్తి!
X
అది 1970వ సంవత్సరం. నాడు ప్రపంచంలో రెండే సూపర్‌ పవర్‌ దేశాలుగా వెలుగొందుతున్నాయి. ఒకటి.. అమెరికా, రెండు.. సోవియట్‌ యూనియన్‌ (ప్రస్తుత రష్యా). అమెరికా అధ్యక్షుడు మాట అంటే అప్పట్లో దైవ శాసనం కిందే లెక్క. అలాంటి వ్యక్తిని కూడా ఎదిరించి నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అపర కాళిక అని నాటి ప్రతిపక్ష నేత అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రశంసలు పొందారు. పాకిస్థాన్‌ చెర నుంచి తూర్పు పాకిస్థాన్‌కు విముక్తి ప్రసాదించి దాన్ని బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేశారు. తద్వారా మరో కొత్త స్వతంత్య్ర దేశం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిని ఖాతరు చేయలేదు.. ఇందిర.

నాటి ఘటనకు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నాటి సంగతులను ఓసారి గుర్తు చేసుకుంటే.. 1970 డిసెంబర్‌ 7న వెలువడిన ఎన్నికల ఫలితాలు పశ్చిమ పాకిస్థాన్‌లోని సైనిక పాలకులను బిత్తరపోయేలా చేశాయి. మొత్తం 300 స్థానాల్లో తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌)కు చెందిన అవామీలీగ్‌ పార్టీకికు 160 లభించాయి.

దీన్ని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)కి చెందిన జుల్ఫీకర్‌ అలీ భుట్టో తట్టుకోలేక పోయారు. మిలటరీ జనరల్‌ యాహ్యాఖాన్‌తో కలిసి అధికారం దక్కించుకోవడానికి పీపీపీ చేసిన యత్నాలు ఫలించలేదు.

ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన అవామీలీగ్‌కు అధికారం అప్పగించడంలో జాప్యం జరిగింది. దీంతో ఆ పార్టీకి బలమున్న తూర్పు పాకిస్థాన్‌లో హింస పేట్రేగింది. దీని అణచివేతకు లెఫ్టినెంట్‌ జనరల్‌ టిక్కాఖాన్‌ నేతృత్వంలో పాక్‌ సైన్యం క్రూరమైన 'ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌'ను ప్రవేశపెట్టింది. దీంతో 10 లక్షల మంది శరణార్థులు తమ మానప్రాణాలు కాపాడుకోవడానికి భారత్‌లోకి వచ్చారు. పాక్‌ చేపట్టిన మారణహోమాన్ని ఆపాలని కోరుతూ నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రపంచ దేశాధినేతలను కలిశారు.

ఈ క్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1971 నవంబర్‌ 3–6 తేదీల్లో అమెరికాలో పర్యటించారు. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌తో భేటీ అయ్యారు. పాకిస్థాన్‌ తమ మిత్రదేశం కావడంతో అమెరికా అప్పటికే భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. ఇందిరతో జరిగిన భేటీలో నిక్సన్‌ మాట్లాడుతూ ''పాకిస్థాన్‌ విషయంలో భారత్‌ జోక్యం చేసుకొంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. భారత్‌కు గుణపాఠం చెబుతుంది'' అని కఠినంగా హెచ్చరించారు.

ఈ తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు ఏమాత్రం భయపడని భారత ప్రధాని ఇందిర అమెరికా అధ్యక్షుడి కళ్లలోకి సూటిగా చూస్తూ..''అమెరికాను భారత్‌ ఒక మిత్రదేశంగా చూస్తుంది. అంతేగానీ యజమానిగా కాదు. తన విధిరాతను తాను రాసుకొనే శక్తి భారత్‌కు ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు'' అని అమెరికా అధ్యక్షుడికి దీటుగా బదులిచ్చారు. ఈ విషయాన్ని నాటి అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి, ఎన్‌ఎస్‌ఏ హెన్రీ కిసెంజర్‌ తన ఆత్మకథలో ప్రస్తావించడం విశేషం.

కాగా అమెరికా అధ్యక్షుడితో ఇందిర భేటీ జరిగినప్పుడు మీడియాను ఉద్దేశించి సంయుక్త సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. అయితే ఇందిరాగాంధీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెళ్లిపోయేందుకు అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి కారెక్కారు. ఆ సమయంలో హెన్రీ కిసెంజర్‌ ఆమె వద్దకు వచ్చి.. ''మేడమ్‌.. అధ్యక్షుడితో ఓర్పుగా వ్యవహరించాలని మీకు అనిపించలేదా..?'' అని ప్రశ్నించారు. దీనికి ఇందిరాగాంధీ తనదైన శైలిలో స్పందిస్తూ.. ''అభివృద్ధి చెందుతున్న దేశంగా.. మా వెన్నెముకలు నిటారుగా ఉంటాయి. అన్ని రకాల దౌర్జన్యాలను ఎదుర్కొని పోరాడేందుకు అవసరమైన వనరులు, స్థైర్యం మాకున్నాయి. వేల మైళ్ల దూరంలోని ఒక శక్తి.. మరో దేశాన్ని పాలించే రోజులు పోయాయని మేము నిరూపిస్తాం'' అని చెప్పి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఇందిర ఢిల్లీకి వచ్చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఆమె నివాసానికి పిలిపించారు. దాదాపు ఆయనతో గంటసేపు మాట్లాడి.. ఐక్యరాజ్యసమితిలో భారత్‌ తరఫున వాదనలు వినిపించేందుకు ఒప్పించారు.

ఉప్పూనిప్పుగా వ్యవహరించే అధికార, ప్రతిపక్షాలు ఇలా కలిసిపోవడంపై ఓ జర్నలిస్టు వాజ్‌పేయిని ప్రశ్నించారు. దానికి వాజ్‌జేయి స్పందిస్తూ.. ''గులాబీ, లిల్లీ రెండూ తోటకు అందాన్నిస్తాయి. వ్యక్తిగతంగా ఈ రెండు పూలు ఒకదానికంటే ఒకటి తామే అత్యంత అందమైనవని అనుకుంటాయి. కానీ, ఉద్యానవనానికి ముప్పు వాటిల్లినప్పుడు.. తోట దాని అందాన్ని సమష్టిగా కాపాడుకోవాల్సి ఉంటుంది. నేను ఈ రోజు తోటను రక్షించడానికి వచ్చాను' అంటూ భారత గౌరవ ప్రతిష్టలను, ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పారు.

మరోవైపు పాకిస్థాన్‌పై డిసెంబర్‌ 3వ తేదీన యుద్ధ ప్రకటన కంటే ముందే భారత్‌కు రెండు విజయాలు లభించాయి. నవంబర్‌ 21న తూర్పు పాకిస్థాన్‌లోని జరిగిన పోరాటంలో భారత సైన్యం విజయం సాధించింది. డిసెంబర్‌ 3వ తేదీన 51 యుద్ధ విమానాలతో పాకిస్థాన్‌.. భారత్‌పై దాడికి దిగింది. దీనికి 'ఆపరేషన్‌ ఛెంఘిజ్‌ఖాన్‌' అని పేరుపెట్టడం గమనార్హం. పాక్‌ విమానాలు ఆగ్రా వరకు వచ్చాయి. వీటిని భారత్‌ యుద్ధ విమానాలు నేలకూల్చాయి.

మరోవైపు పాక్‌ సైన్యం కశ్మీర్‌ వద్ద దాడులు మొదలుపెట్టింది. భారత సైన్యం కూడా ధీటుగా ప్రతిస్పందించింది. భారత్‌ 'ఆపరేషన్‌ ట్రైడెంట్‌' పేరుతో పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరమైన కరాచీ ఓడరేవును పూర్తిగా ధ్వంసం చేసింది. మరోవైపు భారత యుద్ధ విమానాలు పాక్‌ సైన్యంపై బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు భారత్‌.. తూర్పు పాకిస్థాన్‌లో తెలివిగా 'తంగైల్‌ ఎయిర్‌ డ్రాప్‌' చేపట్టి పాక్‌ సైన్యాన్ని లొంగదీసుకొంది. పాక్‌ వైపు నుంచి 93 వేల మంది సైనికులు లొంగిపోయారు. ఈ యుద్ధంలో భారత్‌ వైపు 3,000 మంది సైనికులు మరణించారు.

ఈ యుద్ధం ద్వారా తూర్పు పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌ పేరుతో ఆవిర్భవించింది. పాక్‌పై యుద్ధభేరి మోగించి ఇందిర.. నాటి ప్రతిపక్ష నేత అటల్‌ బిహారి వాజ్‌పేయితో అపర కాళిక అని కీర్తించబడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.