Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలోని 42 గ్రామాలు తెలంగాణలో కలవాలనుకుంటున్నారట

By:  Tupaki Desk   |   30 Oct 2020 11:00 AM IST
మహారాష్ట్రలోని 42 గ్రామాలు తెలంగాణలో కలవాలనుకుంటున్నారట
X
ఒక రాష్ట్రానికి చెందినవారు.. వేరే రాష్ట్రంలోకి తమను కలిపేయాలని కోరటం ఎక్కడైనా విన్నామా? కానీ.. ఇప్పుడు అలాంటి సీన్ తెలంగాణలో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే మహారాష్ట్రకు చెందిన 42 గ్రామాల వారు తమను తెలంగాణ రాష్ట్రంలో కలిపేసుకోవాలని కోరుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో.. తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని వారు కోరుతున్నారు.

ఈ మేరకు ఆయా గ్రామాలకు చెందిన ప్రతినిధులు తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును కలిసి.. వినతిపత్రం అందజేయటం గమనార్హం. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన 42 గ్రామాల వారు తెలంగాణ రాష్ట్రంలో తమను కలుపుకోవాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో ఉన్నామనే కానీ.. తమకు ఎలాంటి వసతులు.. సౌకర్యాలు లేవని.. ఎలాంటి పథకాలు అమలు కావటం లేదని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతమైన పథకాల్ని అమలు చేస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.

మహారాష్ట్ర రైతుల ప్రపోజల్ ను తాము ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళతామని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వారు చూపించిన స్ఫూర్తి అభినందనీయమని హరీశ్ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ లేని రీతిలో.. ఇలాంటివి అయితే సీఎం కేసీఆర్ వద్దకు నేరుగానో.. కాదంటే మంత్రి కేటీఆర్ ను కలిసి విన్నపాలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా మంత్రి హరీశ్ ను కలవటం వెనుక వేరే ఏదైనా లెక్క ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.