Begin typing your search above and press return to search.

మానవ జాతి గురించి కొత్త మర్మం తెలిసింది

By:  Tupaki Desk   |   3 Feb 2018 12:22 PM IST
మానవ జాతి గురించి కొత్త మర్మం తెలిసింది
X
మనిషి అనేవాడు ఎప్పుడు పుట్టాడు.. ఎలా పుట్టాడు.. ముందుగా తన ప్రస్థానాన్ని ఎక్కడ మొదలుపెట్టాడనే పరిశోధనలు వేల ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనకు ఎక్కడా ఫుల్ స్టాప్ పడట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి రావడం.. మళ్లీ ఎన్నో సందేహాలు రావడం.. మరో కోణం నుంచి పరిశోధనలు కొనసాగించడం.. ఎప్పట్నుంచో జరుగుతున్నదే. తాజాగా మానవజాతి మూలాలకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అందరినీ విస్మయానికి గురి చేసింది.

మొన్నటిదాకా ఈ భూమి మీద ఆధునిక మానవుడు అవతరించి దాదాపు మూడు లక్షల ఏళ్లు అయిందన్న అభిప్రాయంతో ఉన్నారందరూ. హోమో సెపియన్ ఆఫ్రికాలో పుట్టి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరించాడని అందరూ అనుకుంటున్నారు. ఐతే తాజా పరిశోధనలు ఈ అంచనాలు తప్పంటున్నాయి. సుమారు నాలుగు లక్షల ఏళ్ల కిందటే హోమోసేపియన్‌ జాతి మానవులు సంచరించారట.. అది కూడా ఇండియాలో వారి మూలాలు ఉన్నాయట. ఇందుకు అవసరమైన ఆధారాలను పురాతత్వ శాస్త్రవేత్తలు సంపాదించారు. ఇండియాలో లభించిన పురాతన రాతి పనిముట్లకు.. ఆఫ్రికాలో లభించిన వాటికి దగ్గరి పోలికలుండటంతో ఈ అంచనాకు వచ్చినట్లు చెన్నైలోని శర్మ సెంటర్‌ ఫర్‌ హెరిటేజ్‌ ఎడ్యుకేషన్‌ కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త పప్పు శాంతి తెలిపారు. చెన్నై సమీపంలోనే ఈ పని ముట్లు లభించాయట. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన హోమో సేపియన్లే వీటిని తయారు చేశారా.. లేక ఇక్కడి వాళ్లే వీటిని రూపొందించారా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ పనిముట్లతోపాటు శిలాజాలేవీ లభించలేదట.