Begin typing your search above and press return to search.

టెక్నాలజీ మాయ; లాఠీఛార్జ్‌కి ఛాన్స్‌ లేకుండా నిరసనలు

By:  Tupaki Desk   |   15 April 2015 6:17 AM
టెక్నాలజీ మాయ; లాఠీఛార్జ్‌కి ఛాన్స్‌ లేకుండా నిరసనలు
X
ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకంగా పోరాటం.. నిరసన తెలపవటం.. ధర్నా చేయటం.. రాస్తోరోకో చేయటం.. ముట్టడించటం లాంటివెన్నో మామూలే. నిరసనలు ఏ ఒక్కదేశానికో పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయితే.. ఈ నిరసనలు చాలా సందర్భాల్లో హింసాత్మకంగా మారుతుంటాయి.

తాము తలపెట్టిన నిరసనల్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచి వేయటంపై నిరసనకారులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. నిరసనకారుల తీవ్రత లేకుండా చూసేందుకు వీలుగా పోలీసులు.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అయితే.. రానున్న రోజుల్లో అలాంటి అవకాశమే ఉండకపోవచ్చు. తాజాగా అందుబాటులోకి వచ్చిన త్రీడీ హోలోగ్రాం టెక్నాలజీతో నిర్వహించే నిరసనలతో ఎక్కడికి కావాలంటే అక్కడకు నిరసనను వ్యక్తం చేసే వీలుంటుంది.

ఇలాంటి విచిత్రమైన.. వినూత్నమైన నిరసనను తాజాగా స్పెయిన్‌లోని ఉద్యమకారులు నిర్వహించారు. ఈ వినూత్న నిరసనలో ప్రత్యేకత ఏమిటంటే.. నిరసనకారులు ఎవరికి వారు వారి.. వారి ప్రాంతాల్లో ఉండి నిరసన తెలుపుతారు. అంటే.. మనషులు లేకున్నా.. లేజర్‌ సాయంతో వారు ఉండేలా వారి ప్రతిరూపాలు అక్కడ దర్శనమిస్తాయి.

ఈ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి తాజాగా స్పెయిన్‌లో అక్కడి ప్రభుత్వ వైఖరిని నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. గవర్నమెంట్‌ ఆఫీసుల ముందు నిరసన తెలిపే హక్కును తొలగిస్తూ.. స్పెయిన్‌ సర్కారు గ్యాగ్‌ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. అక్కడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదు. దీనికి నిరసనగా లేజర్‌ టెక్నాలజీని వినియోగించి పెద్దఎత్తున ప్రజలు తాము నిరసన చేస్తున్న విషయాన్ని తమ ప్రతిరూపాల సాయంతో మాడ్రిడ్‌లోని పార్లమెంటు భవనం ఎదుట నిరసన తెలిపారు.

ప్రపంచంలో ఇలాంటి నిరసన ప్రదర్శన మొదటిది. రానున్న రోజుల్లో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తే.. ఎక్కడ కావాలంటే అక్కడ నిరసన తెలుపుతూ అధికారపక్షానికి వణుకు పుట్టించటం ఖాయం. కంటి ముందు నిరసన కనిపిస్తున్నాఅధికారులు ఏమీ చేయలేక ఉండిపోవాల్సిందేనా? లేదంటే..ఈ టెక్నాలజీకి విరుగుడుగా మరరో టెక్నాలజీని తెరపైకి తెస్తారా? చూడాలి..!